ఇందిరమ్మ ఇళ్లు రెండో విడతలో వారికే తొలి ప్రాధాన్యం: మంత్రి పొంగులేటి
ABN , Publish Date - Jun 17 , 2026 | 05:42 PM
ఇందిరమ్మ ఇళ్లు రెండో విడతలో గుడిసె వాసులకే తొలి ప్రాధాన్యం ఇస్తామని తెలంగాణ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్లపై ఆ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్, జూన్17: ఇందిరమ్మ ఇళ్లు రెండో విడతలో గుడిసె వాసులకే తొలి ప్రాధాన్యం ఇస్తామని తెలంగాణ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్లపై గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా గుడిసెల గుర్తింపునకు ప్రత్యేక సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. 75 వేల గుడిసెల దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన చేస్తామన్నారు. అర్హుల ఎంపిక పూర్తి పారదర్శకతతో చేపడతామని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేయని గుడిసె వాసులకు మరో అవకాశం ఇస్తున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. రెండో విడతలో 2.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడతామని వివరించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 2 వేల ఇళ్లు నిర్మిస్తామని వెల్లడించారు. అలాగే రూఫ్ రీప్లేస్మెంట్ పథకానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రతి నియోజకవర్గానికి 500 ఇళ్లు నిర్మిస్తామని.. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా 50 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.
ప్రమాదకర ఇంటి పైకప్పుల మార్పునకు రూ. 2 లక్షల వరకు సాయం అందిస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అసంపూర్తిగా వదిలిన ఇళ్లను కూడా ఈ పథకంలో ప్రభుత్వం చేర్చనుందన్నారు. లబ్ధిదారుడే ఇంటి నిర్మాణదారడని తెలిపారు. బీఎల్సీ విధానంలో నిర్మాణాలు చేపడతామని పేర్కొన్నారు. పట్టణాల్లో అవసరమైతే జీ+1 నిర్మాణాలకు అనుమతి ఇస్తామని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల ఎప్పుడంటే..?
రుణం చెల్లింపులో కృష్ణా మిల్క్ యూనియన్ సరికొత్త రికార్డు: చైర్మన్ చలసాని ఆంజనేయులు
For More TG News And Telugu News