బొల్లారం ఆయుధాల చోరీ.. మల్లేశ్కు రిమాండ్ విధించిన కోర్టు
ABN , Publish Date - Sep 12 , 2026 | 09:34 AM
బొల్లారం మద్రాస్ రెజిమెంట్లో జరిగిన ఆయుధాల చోరీ కేసులో నిందితుడు, మాజీ ఆర్మీ అధికారి మల్లేశ్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతడిని చంచల్గూడ జైలుకు పోలీసులు తరలించారు.
హైదరాబాద్, సెప్టెంబర్12: బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్లో జరిగిన ఆయుధాల చోరీ కేసులో నిందితుడు, మాజీ ఆర్మీ అధికారి మల్లేశ్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతడిని శనివారం చంచల్గూడ జైలుకు పోలీసులు తరలించారు. ఈ రెజిమెంట్లో పని చేసి ఇటీవలే సస్పెండైన మాజీ హవల్దార్ మల్లేశ్ అలియాస్ రాజు ఈ చోరీ చేసినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. అతడిని అరెస్ట్ చేశారు. అమ్రాబాద్ మండలం జంగంరెడ్డిపల్లిలోని అతడి నివాసం నుంచి చోరీ చేసిన ఆయుధాలు, తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆగస్ట్ 30వ తేదీన బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్లో ఆయుధాల చోరీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రెజిమెంట్లోని ఆయుధగారం నుంచి 12 అత్యాధునిక ఆయుధాలు, 21 మ్యాగజైన్లు,1,912 తూటాలు, ఒక నైట్ విజన్ బైనాక్యులర్ మాయమయ్యాయి. ఈ చోరీపై బొల్లారం పోలీసులకు ఆర్మీ అధికారులు ఫిర్యాదు చేశారు. మరో వైపు ఈ చోరీపై మిలిటరీ ఇంటెలిజెన్స్ కూడా రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టింది.
ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆర్మీ సిబ్బందిని ప్రశ్నించారు. అలాగే క్రమశిక్షణా చర్యల్లో భాగంగా విధుల నుంచి తొలగించిన 34 మందిని, సెలవుల్లో వెళ్లిన 54మందిని, సర్వీసు నుంచి పెన్షన్డ్ అవుట్ అయిన ఏడుగురిని పోలీసులు ప్రశ్నించారు. చివరకు మల్లేశ్ నిందితుడని పోలీసులు తేల్చారు. అనంతరం అతడిని అరెస్ట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నేడు, రేపు 4 జనసాధారణ్ ప్రత్యేక రైళ్లు
హాలు బయటే కలెక్టర్ల సెల్ఫోన్లు
For More TG News And Telugu News