Share News

ప్రజల ఆశీర్వాదంతో ప్రజాపాలనకు 1000 రోజులు

ABN , Publish Date - Sep 01 , 2026 | 06:50 AM

రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంతో ప్రజాపాలన 1000 రోజులు పూర్తి చేసుకుందని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. ఈ వెయ్యి రోజుల పండుగలో విద్యా, వైద్య రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు.

ప్రజల ఆశీర్వాదంతో ప్రజాపాలనకు 1000 రోజులు
Maheshkumar Goud

  • విద్యా, వైద్య రంగాలకు పెద్దపీట వేశాం

  • రైతు సంక్షేమానికి ప్రాధాన్యం:మహేశ్‌గౌడ్‌

  • కాంగ్రెస్‌ విజయాలను చూసి బీఆర్‌ఎస్‌కు

  • భయం పట్టుకుంది: పొన్నం, అడ్లూరి

హైదరాబాద్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంతో ప్రజాపాలన 1000 రోజులు పూర్తి చేసుకుందని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. ఈ వెయ్యి రోజుల పండుగలో విద్యా, వైద్య రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని.. రైతులు, మహిళలు, వ్యవసాయ కూలీలు, బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తోందని చెప్పారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిచ్చి రూ.2లక్షల వరకు పంట రుణాల మాఫీ ద్వారా దాదాపు 25.35లక్షల మంది రైతులకు రుణ విముక్తి కలిగిస్తూ రూ.20వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేసిందన్నారు. రైతు భరోసాను ఎకరానికి రూ.12వేలకు పెంచి, ఇప్పటివరకు రూ.36వేల కోట్లు అందించామని తెలిపారు. వ్యవసాయ రంగానికి రూ.1.75లక్షల కోట్లు ఖర్చు చేసి రికార్డు సృష్టించామని, సన్న వడ్ల బోన్‌సకు రూ.4 వేల కోట్లు, ఉచిత విద్యుత్తుకు రూ.30 వేల కోట్లు, రైతు బీమాకు రూ.3,500 కోట్లు కేటాయించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశామని స్పష్టం చేశారు. గృహజ్యోతి కింద 200యూనిట్ల ఉచిత విద్యుత్తు, రూ.500కే ఎల్పీజీ సిలిండర్‌, 16.32 లక్షల కొత్త రేషన్‌ కార్డులను జారీ చేశామన్నారు. యువతకు ఉపాధి, విద్యారంగ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ 70 వేలకు పైగా ప్రభుత్వ నియామకాలు చేపట్టామని పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధికి యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. బీసీ కులగణన చేపట్టి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించామని.. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. ప్రజాపాలన ప్రభుత్వం విజయవంతంగా 1,000 రోజులు పూర్తి చేసుకోవడం పట్ల సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, కాంగ్రెస్‌ శ్రేణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.


బీఆర్‌ఎస్‌కు ప్రజలే తగిన జవాబు చెప్పాలి

రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం విజయవంతంగా 1000 రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న తరుణంలో బీఆర్‌ఎస్‌ చేపడుతున్న నిరసనలకు ప్రజలే తగిన సమాధానం చెప్పాలని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ విజయాలను చూసి భయంతోనే బీఆర్‌ఎస్‌ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం నిరసనల నాటకమాడుతున్నారని విమర్శించారు. పదేళ్ల పాలనలో తెలంగాణను అప్పులమయం చేసి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపిన బీఆర్‌ఎ్‌సకు ప్రభుత్వంపై నిరసన తెలిపే నైతిక హక్కు లేదన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు గ్రామాల్లోకి వచ్చినప్పుడు పదేళ్లలో ఏం చేశారని ప్రజలు నిలదీయాలని కోరారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు, వాటి వడ్డీల భారంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ వ్యవసాయం, విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు.


ఇవి కూడా చదవండి

‘22ఏ’ను రద్దు చేయకపోతే అసెంబ్లీని నడవనివ్వం

చేయూత గడువు పెంపు

Updated Date - Sep 01 , 2026 | 06:50 AM