‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సదస్సు నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు : డిప్యూటీ సీఎం భట్టి
ABN , Publish Date - Sep 01 , 2026 | 06:03 AM
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో జరిగే ఈ సదస్సు ఏర్పాట్లపై సోమవారం ఆయన ప్రజాభవన్లో సమీక్ష నిర్వహించారు
హైదరాబాద్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో జరిగే ఈ సదస్సు ఏర్పాట్లపై సోమవారం ఆయన ప్రజాభవన్లో సమీక్ష నిర్వహించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తదితరులు పాల్గొన్నారు. సదస్సుకు సంబంధించి ప్రతి అంశాన్ని సమీక్షించి, నిర్ణయాలు వేగంగా తీసుకునేలా ప్రజాభవన్లో ప్రత్యేకంగా వార్రూమ్ను ఏర్పాటు చేయాలని భట్టి సూచించారు. సదస్సు నిర్వహణకు కమిటీలను ఏర్పాటు చేసి, సీనియర్ ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. సదస్సుకు ప్రత్యేకమైన లోగోను రూపొందించాలన్నారు. అక్టోబర్ మొదటి లేదా రెండో వారంలో ఢిల్లీలో కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు.