రేవంత్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటి?: ఎంపీ డీకే అరుణ
ABN , Publish Date - Jun 11 , 2026 | 07:29 PM
రాష్ట్ర ప్రభుత్వం పనులు చేయలేక కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ పార్టీ నేతలను బీజేపీ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు.
మహబూబ్నగర్, జూన్11: రాష్ట్ర ప్రభుత్వం పనులు చేయలేక కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ పార్టీ నేతలను బీజేపీ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. గురువారం మక్తల్లో ఎంపీ డీకే అరుణ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. నూతన గ్రామ పంచాయతీ భవనాలు, సీసీ రహదార్లు, అంగన్వాడీ కేంద్రాలు, భవనాలు, బాలింతలకు, గర్భిణీలకు కేంద్ర ప్రభుత్వమే పౌష్టిక ఆహారం అందిస్తుందన్నారు. ఈ రెండున్నర ఏళ్లలో ఏ ఒక్క పెండింగ్ పనులు చేయలేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. గతంలో కేసీఆర్ ప్రాంతాల మధ్య విద్వేషాలు, సెంటిమెంట్తో మాయమాటలు చెప్పి అధికారంలో వచ్చాడన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు మరొక్కసారి గారడి మాటలతో అబద్ధం చెప్పి అధికారంలో వచ్చాడని మండిపడ్డారు.
రెండు తులాల బంగారం, మహిళలకు రూ.2 వేల పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదంటూ అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంపీ సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత చేసిన అభివృద్ధి ఏమిటని ఆ పార్టీ నేతలను ఈ సందర్భంగా నిలదీశారు. రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన అప్పు ఎంతో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కొడంగల్లో రోడ్లు వేస్తే సరిపోదని.. రాష్ట్రమంతా వేయాలన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నారని ఆరోపించారు.
ఇంటి జాగా లేని వారికి స్థలం ఇచ్చి ఇల్లు ఇస్తామన్న హామీ ఏమైందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలను బీజేపీ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. దేశంలో అధిక కాలం ప్రధాన మంత్రి పదవి చేపట్టి ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారన్నారు. దేశాన్ని అన్ని రకాలుగా బీజేపీ అభివృద్ధి చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అందుకే దేశ ప్రజలు మూడోసారి బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టారని డీకే అరుణ చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నేటికి వ్యవసాయ శాఖపై సమీక్ష చేయని సీఎం రేవంత్: కవిత
ఉపాధ్యాయ నియామకాల్లో గొడ్డలి రాజకీయాలు చేస్తున్న జగన్ : టీడీపీ ఎమ్మెల్సీ ఫైర్
For More TG News And Telugu News