యువకుల ప్రాణం తీసిన చేపల వేట..
ABN , Publish Date - Mar 16 , 2026 | 11:48 AM
చేపల వేటకు వెళ్లి.. ముగ్గురు యువకులు మృతి చెందిన సంఘటన గండిపేట జలాశయం దిగువున ఉన్న మూసి నది పరివాహక ప్రాంతంలో చోటు చేసుకుంది.
హైదరాబాద్, మార్చి 16: చేపల వేటకు వెళ్లి.. ముగ్గురు యువకులు మృతి చెందిన సంఘటన గండిపేట జలాశయం దిగువున ఉన్న మూసి నది పరివాహక ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు, రెస్క్యూ టీం నదిలో గాలించి వారి మృతదేహాలను సోమవారం ఉదయం ఒడ్డుకు తీసుకువచ్చారు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్లోని ఇబ్రహీంబాగ్కు చెందిన కార్తీక్ (25), గోవర్ధన్ (23), వెంకటేష్ (25)లు నిన్న ఆదివారం కావడంతో మూసి నది పరివాహక ప్రాంతంలో చేపల వేటకు వెళ్లారు.
లోతు ఎక్కువగా ఉండడంతో.. వారు నదిలో మునిగిపోయారు. ఈ విషయాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అలాగే రెస్క్యూ టీమ్ను సైతం అక్కడికి రప్పించారు. నిన్న సాయంత్రం నుంచి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ రోజు ఉదయం వారి మృతదేహాలు లభ్యమయ్యాయి.
మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ముగ్గురు ఒకే కాలనీ వాసులు కావడంతోపాటు స్నేహితులని మృతుల బంధువులు తెలిపారు. మృతుల కుటుంబాలు గాంధీ ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరు అవుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఒత్తిడికి గురికావద్దు.. పరీక్షలు ప్రశాంతంగా రాయండి: మంత్రి నారా లోకేశ్
ఒడిశాలోని కటక్ SCB హాస్పిటల్లో భారీ అగ్నిప్రమాదం, పది మంది మృతి
For More TG News And Telugu News