Share News

Medaram: మేడారంలో ఏఐ.. అత్యాధునిక డ్రోన్‌ వ్యవస్థతో నిఘా

ABN , Publish Date - Jan 20 , 2026 | 12:52 PM

మేడారం మహాజాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ భద్రత కల్పిస్తున్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ) ఆధారిత డ్రోన్‌ వ్యవస్థ, జియో ట్యాగింగ్‌ ట్రాకింగ్‌ సిస్టంతో పాటు 13వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు.

Medaram: మేడారంలో ఏఐ.. అత్యాధునిక డ్రోన్‌ వ్యవస్థతో నిఘా

  • సాంకేతిక నిఘాలో 13 వేల మంది విధులు

  • జియోట్యాగ్‌తో మిస్సింగ్‌ పర్సన్‌ ట్రాకింగ్‌

  • 12 క్రైం బృందాలతో శాంతి భద్రతల పరిరక్షణ

ములుగు: మేడారం(Medaram) సమ్మక్క- సారలమ్మ మహా జాతరకు వారం రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో పోలీసులు అత్యాధునిక టెక్నాలజీతో శాంతి భద్రతలను పరిరక్షిం చేందుకు సన్నద్ధమయ్యారు. ఈనెల 28 నుంచి 31 వరకు జరగనున్న ఈ మహాజాతరకు లక్షలాది మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. ఇందు కోసం ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ) ఆధారిత డ్రోన్‌ వ్యవస్థ, జియో ట్యాగింగ్‌ ట్రాకింగ్‌ సిస్టంతో పాటు 13వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తు, 12క్రైం డిటెక్షన్‌ బృందాల సభ్యులు శాంతి భద్రతలను పర్యవేక్షించనున్నారు.


medaram2.jpg

మొదటిసారిగా ‘టీజీ క్వెస్ట్‌’

టీజీ క్వెస్ట్‌ పేరుతో అభివృద్ధి చేసిన ఏఐ ఎనేబుల్డ్‌ డ్రోన్‌ పోలీసింగ్‌ సిస్టమ్‌ను మేడారం మహాజాతరలో మొదటిసారి వినియోగించనున్నారు. ఈ డ్రోన్లు జన సమూహం, ట్రాఫిక్‌ నియంత్రణ, భద్రతా పర్యవేక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. ‘మేడారం 2.0’గా పిలుచుకునే ఈ వ్యవస్థలో నెక్స్ట్‌ జనరేషన్‌ ఏఐ ఎనలిటిక్స్‌, డ్రోన్‌ ఆధారిత సర్వేలైన్స్‌లను ఇంటిగ్రేట్‌ చేశారు. ఇవి జన సమూహంలో ఆకస్మిక రద్దీ, స్టాంపెడ్‌ ప్రమాదాలను, ట్రాఫిక్‌ జామ్‌లను, మిస్సింగ్‌ పర్సన్స్‌ వంటి సమస్యలను గుర్తించి అలర్ట్‌ చేస్తాయి.


medaram1.jpg

తప్పిపోయిన వారి జాడ కోసం..

మహాజాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన భక్తులు తప్పి పోతే వారి జాడను తెలుసుకునేందుకు వోడా ఫోన్‌, ఐడియాతో కలిసి పోలీసులు జియో ట్యాగ్‌ ఆధారిత ట్రాకింగ్‌ సిస్టమ్‌ను ప్రవేశ పెట్టారు. జాతరకు వచ్చే భక్తుల్లో పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులకు పస్రా, తాడ్వా యి మార్గాలో క్యూఆర్‌ కోడ్‌తో కూడిన స్మార్ట్‌ రిస్ట్‌ బ్యాండ్లు ఇవ్వనున్నారు. తప్పిపోయిన వ్యక్తుల ఆచూకీని ఇవి వెంటనే కనుగొంటాయి. ఈ విధానం శబరిమలో విజయవంతమైందని అధికారులు చెబుతున్నారు.


13 వేల మందితో సాంకేతిక నిఘా

మహాజాతర కోసం పోలీసులు ఏర్పాటు చేస్తున్న టెక్నాలజీ సర్వైలైన్స్‌ లో సుమారు 13 వేల మంది విధులు నిర్వర్తించనున్నారు. జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా హీలియం బెలూన్లకు అమర్చిన పాన్‌ టిల్ట్‌ జూమ్‌ కెమెరాలు పరిశీలిస్తాయి. తొక్కిసలాడే ప్రాంతాలను ముందే పసిగట్టి పోలీసులను అప్రమత్తం చేస్తాయి.


medaram1.2.jfif

12 క్రైమ్‌ డిటెక్షన్‌ బృందాలు

మేడారం మహాజాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు 12 క్రైమ్‌ డిటెక్షన్‌ బృందాలను రంగంలోకి దింపనున్నారు. అలాగే పాత నేరస్థుల గుర్తింపునకు ఆస్పత్రి ప్రాంగణాలు, పార్కింగ్‌ స్థలాల వద్ద ఫేస్‌ రికగ్నైజేషన్‌ సాంకేతికతను వినియోగించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

భారీ పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా..

ఏపీలో స్విస్‌ పెట్టుబడులకు సహకరించండి

Read Latest Telangana News and National News

Updated Date - Jan 20 , 2026 | 12:53 PM