Share News

ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్!

ABN , Publish Date - Jun 19 , 2026 | 05:11 PM

భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ కోచ్‌గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో యువీ కోచ్‌గా చేరనున్నట్లు ఐపీఎల్ వర్గాల సమాచారం.

ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
Yuvraj Singh

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ కోచ్‌గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో యువీ కోచ్‌గా చేరనున్నట్లు ఐపీఎల్ వర్గాల సమాచారం. గత రెండు సీజన్లుగా అక్షర్ పటేల్ నాయకత్వంలోని జట్టు ఆశించిన ఫలితాలు అందించలేకపోయింది. దీంతో డీసీలో భారీ మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.


ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీని సంయుక్తంగా నిర్వహిస్తున్న జీఎంఆర్, జేఎస్‌డబ్ల్యూ గ్రూపులు రెండేళ్ల చొప్పున జట్టు నిర్వహణ బాధ్యతలు చేపడుతున్నాయి. 2025, 2026 సీజన్లలో జీఎంఆర్ నిర్వహణలో జట్టు కొనసాగగా.. 2027 నుంచి మళ్లీ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ బాధ్యతలు స్వీకరించనుంది. ఈ మార్పులతో పాటు కోచింగ్ సిబ్బందిలోనూ భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో జేఎస్‌డబ్ల్యూ నిర్వహణ కాలంలో భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా పనిచేశాడు. ప్రస్తుతం ప్రధాన కోచ్‌గా ఉన్న హేమంగ్ బదానీ భవితవ్యంపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో గంగూలీ మళ్లీ జట్టు వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం.


గత రెండు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. అక్షర్ పటేల్ సారథ్యంలో కేఎల్ రాహుల్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ జట్టు ప్లే ఆఫ్స్‌ దశ వరకు కూడా చేరుకోలేకపోయింది. 2025లో ఐదో స్థానంలో నిలిచిన ఢిల్లీ, 2026లో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ నిరాశాజనక ఫలితాల నేపథ్యంలో జట్టు మేనేజ్‌మెంట్ ఈ భారీ మార్పులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గంగూలీ సూచనల మేరకు యువరాజ్ సింగ్‌ను కోచింగ్ బృందంలోకి తీసుకురావాలని ఫ్రాంచైజీ యోచిస్తున్నట్లు సమాచారం. అయితే యువరాజ్‌కు ఏ బాధ్యతలు అప్పగిస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.


ఇదిలా ఉండగా, ఈ ఏడాది ఎస్‌ఏ20 టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ అనుబంధ జట్టు ప్రిటోరియా క్యాపిటల్స్‌కు సౌరభ్ గంగూలీ ప్రధాన కోచ్‌గా వ్యవహరించి జట్టును ఫైనల్‌కు చేర్చిన సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ 2027లో గంగూలీ-యువరాజ్ జోడీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త ఊపు తీసుకురావొచ్చని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

వైభవ్ రాణిస్తే టెస్ట్ క్రికెట్‌కు పునరుజ్జీవనం

అఫ్గాన్‌తో చివరి వన్డే.. అనూహ్యంగా భారత జట్టులో కొత్త ప్లేయర్

Updated Date - Jun 19 , 2026 | 05:12 PM