ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్: పావురాలు.. కోతుల బెడదకు చెక్ పెట్టేలా.. !
ABN , Publish Date - Aug 11 , 2026 | 07:49 AM
భారత్ వేదికగా జరగనున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కోసం నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఇండియా ఓపెన్లో పావురాల కారణంగా మ్యాచ్కు రెండుసార్లు అంతరాయం ఏర్పడటంతో.. ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ వేదికగా జరగనున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కోసం నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 17 నుంచి 23 వరకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ పోటీలు జరగనున్నాయి. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఇండియా ఓపెన్లో పావురాల కారణంగా మ్యాచ్కు రెండుసార్లు అంతరాయం ఏర్పడటంతో.. ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. స్టేడియంలోని వెంట్లను మూసివేయడంతో పాటు చెక్క తలుపుల స్థానంలో డబుల్ డోర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పక్షులు లోపలికి రాకుండా అమెరికా నుంచి తెప్పించిన విష రహిత జెల్ను ఉపయోగిస్తున్నారు. అలాగే వేట పక్షుల అరుపులను అనుకరించే ప్రత్యేక యంత్రాలను కూడా ఏర్పాటు చేశారు. కోతులు, వీధి కుక్కల బెడదను నివారించేందుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్తో అధికారులు సమన్వయం చేస్తున్నారు.
స్టేడియం పైకప్పు మరమ్మతులతో పాటు లీకేజీలను సరిచేశారు. పలు ఎక్స్పాన్షన్ జాయింట్లకు మరమ్మతులు చేశారు. కొత్త కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు పాతవాటికి పాలిష్ చేసి భవనాలకు రంగులు వేశారు. స్టేడియం ఎదురుగా ఉన్న సరస్సును సైతం అభివృద్ధి చేస్తున్నారు. అయితే ఈ ఏర్పాట్లపై భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఎక్స్ వేదికగా స్పందించింది.
‘ఈ పరిష్కారం వెంటే నవ్వు రావొచ్చు. కానీ చేస్తున్న ప్రయత్నాన్ని మాత్రం మెచ్చుకోవాలి. ప్రపంచాన్ని ఆహ్వానించేందుకు ఎంతోమంది తెర వెనుక పనిచేస్తున్నారు. మా పరిష్కారాలన్నీ సంప్రదాయబద్ధమైనవి. మా ఆతిథ్యం, స్ఫూర్తి కూడా అంతే ప్రత్యేకం’ అంటూ ఎక్స్లో పోస్టు చేసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) కూడా స్టేడియంలో చేపట్టిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
ఫిట్నెస్ కోసం 17 కిలోలు తగ్గాడు.. సర్ఫరాజ్ ఖాన్ ఈసారైనా నిరూపించుకుంటాడా?
2027 వన్డే ప్రపంచకప్.. జట్టులో చేరేందుకు సిద్ధంగా ఉన్నా: భువనేశ్వర్ కుమార్