Share News

మూడేళ్ల క్రితమే భారత హెడ్ కోచ్ పదవి ఆఫర్.. కానీ నేనే వద్దన్నా: వీవీఎస్ లక్ష్మణ్

ABN , Publish Date - Aug 09 , 2026 | 09:43 PM

భారత హెడ్‌ కోచ్‌ పదవిపై మాజీ క్రికెటర్‌, బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీఓఈ) హెడ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. 2023లోనే తనకు భారత జట్టు హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చిందని.. అయితే వ్యక్తిగత కారణాలతో ఆ పదవిని స్వీకరించలేకపోయానని వెల్లడించాడు.

మూడేళ్ల క్రితమే భారత హెడ్ కోచ్ పదవి ఆఫర్.. కానీ నేనే వద్దన్నా: వీవీఎస్ లక్ష్మణ్
VVS Laxman

ఇంటర్నెట్ డెస్క్: భారత హెడ్‌ కోచ్‌ పదవిపై మాజీ క్రికెటర్‌, బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీఓఈ) హెడ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. 2023లోనే తనకు భారత జట్టు హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చిందని.. అయితే వ్యక్తిగత కారణాలతో ఆ పదవిని స్వీకరించలేకపోయానని వెల్లడించాడు. సీఓఈని మరింత పటిష్ఠంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే ఆ బాధ్యతల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.


టీమిండియాలో వరుసగా గాయాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా ఆదివారం బెంగళూరులోని సీఓఈని సందర్శించాడు. ఆటగాళ్ల పునరావాసం, గాయాల నిర్వహణ కార్యక్రమాలపై లక్ష్మణ్‌తో సమీక్ష నిర్వహించాడు. అనంతరం లక్ష్మణ్‌, సైకియాతో పాటు బీసీసీఐ అధ్యక్షుడు మిథున్‌ మన్హాస్‌, ఇతర ఉన్నతాధికారులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడాడు. ‘2023లో నేను టీమిండియా హెడ్‌ కోచ్‌ కావాల్సింది. కానీ వ్యక్తిగత కారణాల వల్ల ఆ బాధ్యతలు స్వీకరించలేకపోయాను. ఈ విషయంపై ఐసీసీ ఛైర్మన్ జై షాతో రెండుసార్లు మాట్లాడాను. ఆయన నా పరిస్థితిని అర్థం చేసుకున్నారు. బీసీసీఐ నాకు ఇచ్చిన స్వేచ్ఛతో నా ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే అవకాశం లభించింది. ఇప్పుడు దేవజిత్‌ సైకియా, ఇతర బీసీసీఐ అధికారులు కూడా అదే విధంగా సహకరిస్తున్నారు. మరో రెండేళ్లు సీఓఈ హెడ్‌గా కొనసాగాలని నిర్ణయించుకున్నాను. హెడ్‌ కోచ్‌ బాధ్యతలు తీసుకోకపోయినా.. ఇక్కడి నుంచి వెళ్లేలోపు సీఓఈకి పటిష్ఠమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తానని బీసీసీఐకి హామీ ఇచ్చాను. నిర్మాణం, విధివిధానాలు, ప్రోటోకాల్స్‌ అన్నింటినీ పక్కాగా ఏర్పాటు చేయడమే నా లక్ష్యం’ అని లక్ష్మణ్‌ వివరించాడు.


40 ఎకరాల్లో అత్యాధునిక సౌకర్యాలు

2024 సెప్టెంబర్‌లో అప్పటి బీసీసీఐ కార్యదర్శి జై షా బెంగళూరులో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను ప్రారంభించారు. అంతకుముందు ఇదే కార్యకలాపాలు ఎం.చిన్నస్వామి స్టేడియంలోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) కేంద్రంగా కొనసాగేవి. సుమారు 40 ఎకరాల్లో విస్తరించిన సీఓఈలో మూడు మైదానాలు, ఇండోర్‌, ఔట్‌డోర్‌ సదుపాయాలతో కలిపి 86 పిచ్‌లు ఉన్నాయి. క్రికెట్‌ ప్రతిభను తీర్చిదిద్దడంతో పాటు స్పోర్ట్స్‌ సైన్స్‌, ఫిట్‌నెస్‌, పునరావాస కార్యక్రమాలకు కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేశారు. 2021 చివర్లో రాహుల్‌ ద్రవిడ్‌ నుంచి ఎన్‌సీఏ బాధ్యతలను లక్ష్మణ్‌ స్వీకరించాడు. ఆ తర్వాత ద్రవిడ్‌ టీమిండియా హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుంచి సీఓఈకి లక్ష్మణ్‌ నేతృత్వం వహిస్తున్నాడు. అతడి హయాంలో పాత ఎన్‌సీఏ నుంచి ప్రత్యేక సదుపాయాలతో కూడిన సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌గా ఈ వ్యవస్థ రూపుదిద్దుకుంది.


ఇవి కూడా చదవండి:

శ్రీలంక ఎలెవన్‌తో వార్మప్ మ్యాచ్.. టీమిండియా ఘన విజయం

బంగ్లాదేశ్‌ పర్యటనకు టీమిండియా.. కేంద్రం అనుమతి కోరనున్న బీసీసీఐ!

Updated Date - Aug 09 , 2026 | 09:43 PM