అవును.. మైదానంలో మాత్రం కోహ్లీ అహంకారే: రవి శాస్త్రి
ABN , Publish Date - Jun 15 , 2026 | 02:48 PM
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి భారత మాజీ ప్రధాన కోచ్ రవి శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ వీడియోలో విరాట్ను అహంకారి, అతి గారాభంతో పెరిగిన పిల్లాడు అంటూ ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్పై ఆయన స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి భారత మాజీ ప్రధాన కోచ్ రవి శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ వీడియోలో విరాట్ను అహంకారి, అతి గారాభంతో పెరిగిన పిల్లాడు అంటూ ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్పై ఆయన స్పందించాడు. ఆ అభిప్రాయాలు నిజమే కావొచ్చని.. కానీ అదంతా కేవలం మైదానానికే పరిమితమని రవి శాస్త్రి స్పష్టం చేశాడు. మైదానం దాటిన తర్వాత కోహ్లీ పూర్తిగా భిన్నమని తెలిపాడు. ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశాలపై రవి శాస్త్రి మాట్లాడాడు.
‘అవునండీ.. మీరు అనుకున్నట్లు విరాట్ కోహ్లీ అహంకారే! అతి గారాభంగా పెరిగిన పిల్లాడే. మితిమీరిన ప్రవర్తన కలిగిన వ్యక్తి. ఉద్రేకంగా ఉంటాడు. అతడి అగ్రెషన్ను ఆపడం కష్టమే. ఇవన్నీ వాస్తవమైన విషయాలు. కానీ ఇలా ఉండేది మాత్రం మైదానంలోనే. ఒక్కసారి ఆట నుంచి బయటకు వచ్చాక కోహ్లీ పూర్తి భిన్నంగా మారిపోతాడు. మైదానంలో అలా ఉండి.. ఒక్కసారిగా దాన్నుంచి బయటకొచ్చి సాధారణంగా ఉండే వ్యక్తులంటే నాకు చాలా ఇష్టం’ అని రవి శాస్త్రి తెలిపాడు. అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు రవి శాస్త్రి ప్రధాన కోచ్గా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన కోహ్లీ.. కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం అఫ్గానిస్థాన్తో జరుగుతున్న వన్డే సిరీస్కు కోహ్లీ గాయం కారణంగా దూరమయ్యాడు. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో తొడ కండరాలు పట్టేయడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్లో చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ
IND vs SL: మరోసారి విఫలమైన వైభవ్ సూర్యవంశీ!