నా హాఫ్ సెంచరీ వారందరికీ అంకితం: వైభవ్ సూర్యవంశీ
ABN , Publish Date - Jul 24 , 2026 | 02:24 PM
జింబాబ్వేతో తొలి టీ20లో మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టిన భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ.. మ్యాచ్ అనంతరం బీసీసీఐకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. తన ఇన్నింగ్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: జింబాబ్వేతో తొలి టీ20లో మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టిన భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ.. మ్యాచ్ అనంతరం బీసీసీఐకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. తన ఇన్నింగ్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జింబాబ్వేతో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తొలి మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
‘కెరీర్ ప్రారంభ దశలోనే ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. రాబోయే మ్యాచ్లకు ఇది మంచి ప్రేరణగా ఉంటుంది. నేను నా జోన్లోనే ఉన్నాను. నా బలం ఏంటో నాకు తెలుసు. నా బలంపై నమ్మకం పెట్టుకునే ఆడాను. అదే నాకు విజయాన్ని అందించింది. నా కుటుంబానికి, కోచ్లకు, కష్ట సమయాల్లో నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ నా హాఫ్ సెంచరీని అంకితం చేస్తున్నాను. నేను చేసి ‘ఏ’ సెలబ్రేషన్ మా అమ్మ కోసం. మరో సెలబ్రేషన్ రింకూ భయ్యా (రింకూ సింగ్)తో జరిగిన ఓ సంభాషణ ఆధారంగా చేశాను’ అని వైభవ్ సూర్యవంశీ వివరించాడు.
హరారే మైదానం నచ్చింది..
‘ఇక్కడి వాతావరణం నాకు చాలా నచ్చింది. కొన్ని మైదానాల్లో పరుగులు చేయడం సహజంగానే సులభంగా అనిపిస్తుంది. హరారే కూడా అలాంటి మైదానమే కావచ్చు. అయితే దీన్ని నేను తేలికగా తీసుకోను. ఇంకా మెరుగుపడుతూ జట్టుకు నా వంతు సహకారం అందించేందుకు శ్రమిస్తాను’ అని వైభవ్ పేర్కొన్నాడు. తొలి టీ20లో విజయం సాధించిన భారత జట్టు.. జులై 25న అదే హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరగనున్న రెండో టీ20లో జింబాబ్వేతో తలపడనుంది. ఈ మ్యాచ్లోనూ విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకోవాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది.
ఇవీ చదవండి:
వరల్డ్ కప్ డ్రీమ్ టీమ్లో వొజిన్హా, హాలాండ్