స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్కు సుప్రీంకోర్టులో ఊరట
ABN , Publish Date - May 29 , 2026 | 02:29 PM
ఆసియా క్రీడల ట్రయల్స్ 2026లో పోటీపడే విషయంలో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె సెలక్షన్ ట్రయల్స్లో పోటీ చేసేందుకు ధర్మాసనం అనుమతినిచ్చింది.
స్పోర్ట్స్ డెస్క్: స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్(2026)లో పోటీ చేసేందుకు అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) అనుమతినిచ్చింది. ఈ దశలో ఆమెను (Vinesh Phogat) వెనక్కి రమ్మని చెప్పడం భావ్యం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. అలానే డోపింగ్ టెస్టులకు వినేశ్ మిస్ అవ్వడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సెలబ్రిటీ హోదా ఉన్నంత మాత్రాన నిబంధనల మినహాయింపు ఉండదని స్పష్టం చేసింది. ఒక అథ్లెట్ కెరీర్ను పూర్తిగా దెబ్బతీయలేమని, అందుకే అర్హత పోటీలకు అనుమతి ఇస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది.
ఈనెల 30, 31వ తేదీల్లో జరిగే సెలక్షన్ ట్రయల్స్లో వినేశ్ ఫొగాట్ పోటీ పడేందుకు అనుమతినిస్తూ ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను జారీచేసింది. దీనిపై భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. ‘వినేశ్ ఈ దేశాన్ని గర్వపడేలా చేశారు. ఇప్పటికే ట్రయల్స్లో పాల్గొనేందుకు ఆమెకు హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ దశలో ఆమెను వెనక్కి వెళ్లమని చెప్పడం సరైన నిర్ణయం అనిపించుకోదు. ప్రస్తుతానికి ఈ విషయంలో మేం ఏం చేయలేం. ఆమె పోటీల్లో పాల్గొనవచ్చు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. మరోవైపు డబ్ల్యూఎఫ్ఐ పిటిషన్పై వినేశ్కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.
ఇవి కూడా చదవండి:
కేన్ విలియమన్స్ వరల్డ్ రికార్డ్
వైభవ్కు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు: ప్యాట్ కమిన్స్