విదేశాల్లో భారత బ్యాటర్ల వైఫల్యానికి బౌండరీలే కారణం: సునీల్ గావస్కర్
ABN , Publish Date - Jul 28 , 2026 | 02:33 PM
భారత జట్టు విదేశాల్లో వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్న అంశంపై మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని టీమిండియా.. ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో క్లీన్ స్వీప్ అయిన సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: భారత జట్టు విదేశాల్లో వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్న అంశంపై మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని టీమిండియా.. ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో క్లీన్ స్వీప్ అయిన సంగతి తెలిసిందే. స్వదేశంలో విధ్వంసం సృష్టించే బ్యాటర్లు.. విదేశీ పిచ్లపై తేలిపోతున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి బౌండరీలే అసలు సమస్య అంటూ గావస్కర్ స్పష్టం చేశాడు. స్వదేశంలో మరో సీజన్ ప్రారంభానికి ముందే బౌండరీల పరిమాణాన్ని పెంచాలని బీసీసీఐకి గావస్కర్ సూచించాడు.
‘ఐపీఎల్లో బౌండరీలు దాటే మిస్హిట్ షాట్లు విదేశాల్లో పెద్ద బౌండరీల కారణంగా ఫీల్డర్ల చేతికి చిక్కుతున్నాయి. చాలా మైదానాల్లో ఎల్ఈడీ ప్రకటనల బోర్డుల వెనుక తగినంత స్థలం ఉంటుంది. బౌండరీ తాళ్లను కొంత వెనక్కి జరిపితే బ్యాటర్లు ప్రపంచ కప్నకు మెరుగ్గా సిద్ధమవుతారు. బౌండరీలు పెద్దగా చేయడం వల్ల భారత స్పిన్నర్లకు కూడా ప్రయోజనం ఉంటుంది. నెమ్మదిగా బంతి వేస్తే ఎక్కువ టర్న్, లూప్ లభిస్తాయి. స్పిన్నర్లు వేగంగా బంతులు సంధించడం వల్ల బ్యాటర్లు సులభంగా భారీ షాట్లు ఆడుతున్నారు. ఇంగ్లండ్ స్పిన్నర్లు ఆదిల్ రషీద్, విల్ జాక్స్.. భారత స్పిన్నర్ల కంటే గంటకు 8-10కిమీ తక్కువ వేగంతో బౌలింగ్ చేసి ఎక్కువ ప్రభావం చూపారు’ అని సునీల్ గావస్కర్ విశ్లేషించాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 విజయం తర్వాత టీమిండియా వరుస పరాజయాలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. పసికూన ఐర్లాండ్, ఇంగ్లండ్ జట్లతో వరుసగా సిరీస్ క్లీన్స్వీప్ అయింది. ఆ తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లిన భారత జట్టు.. అక్కడ పుంజుకుని వరుస పరాజయాలకు బ్రేక్ వేసింది. జింబాబ్వేపై మూడు టీ20ల సిరీస్ ఆడి గెలిచి సిరీస్ క్లీన్స్వీప్ చేసింది.
ఇవి కూడా చదవండి:
శ్రీలంకతో టెస్టు సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ
తండ్రి బాటలో తనయుడి విజయం.. కామన్వెల్త్లో తెలుగుకుర్రాడికి రజతం