Share News

విరాట్‌తో వైభవ్‌ సూర్యవంశీని ఆడించాలి: శ్రీశాంత్

ABN , Publish Date - Jun 10 , 2026 | 11:41 AM

టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో కలిసి కోహ్లీని ఒలింపిక్స్ జట్టులో ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్టర్లకు సూచించాడు.

విరాట్‌తో వైభవ్‌ సూర్యవంశీని ఆడించాలి: శ్రీశాంత్
Virat Kohli, Vaibhav Sooryavanshi

ఇంటర్నెట్ డెస్క్: 128 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత క్రికెట్ మళ్లీ ఒలింపిక్స్‌లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత జట్టు కూర్పుపై ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. 2028 లాస్ ఏంజెల్స్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒలింపిక్స్ జట్టులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఆడించాలని అభిప్రాయపడ్డాడు. 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ విజేత జట్టులో సభ్యుడైన శ్రీశాంత్.. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో కలిసి కోహ్లీని ఒలింపిక్స్ జట్టులో ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్టర్లకు సూచించాడు.


‘ఒలింపిక్స్ స్వర్ణ పతకం గురించే ఇప్పుడు చర్చంతా. అందుకే విరాట్ కోహ్లీ జట్టులో ఉండాలని నేను కోరుకుంటున్నాను. సీనియర్-జూనియర్ ప్లేయర్ల కలయిక అద్భుతంగా ఉంటుంది. విరాట్‌తో పాటు వైభవ్ సూర్యవంశీని బరిలోకి దింపితే జట్టుకు ప్రత్యేక బలం చేకూరుతుంది. కోహ్లీ అనుభవం, వైభవ్ దూకుడు జట్టుకు అవసరం. టీ20 ఫార్మాట్‌కు కోహ్లీ వీడ్కోలు పలికాడు. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు వివాదాస్పదంగానే అనిపించవచ్చు. కానీ సెలక్టర్లకు నా విజ్ఞప్తి ఒక్కటే. ఒలింపిక్స్ కోసం విరాట్ కోహ్లీని జట్టులోకి తీసుకోండి. అతడి ఫిట్‌నెస్‌ను చూస్తే ఇప్పటికీ అత్యున్నత స్థాయిలో పోటీ పడగలడు. తన బ్యాట్‌తో ప్రత్యర్థులను కట్టడి చేయగలడు’ అని శ్రీశాంత్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.


మరోవైపు, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్‌లో సంచలనంగా మారాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అతడి ప్రదర్శన ఆధారంగా సెలక్టర్లు ఇటీవలే భారత టీ20 జట్టులో వైభవ్‌కు చోటు కల్పించారు.


ఇవి కూడా చదవండి:

ప్రపంచ ఛాంపియన్‌గా నిలకవపోవడమే మంచిది: గుకేశ్

రిటైర్‌మెంట్ ఆలోచనలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్?

Updated Date - Jun 10 , 2026 | 11:41 AM