Share News

అత్యంత దారుణమైన ప్రదర్శన చేశాం: శ్రేయస్ అయ్యర్

ABN , Publish Date - Jul 08 , 2026 | 07:17 AM

ఇంగ్లండ్‌తో మూడో టీ20లోనూ భారత్ పూర్తిగా విఫలమైంది. ఏకంగా 125 పరుగుల భారీ తేడాతో ఘోర ఓటమిని చవి చూసింది. అయితే మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టు ఓటమిపై మాట్లాడుతూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

అత్యంత దారుణమైన ప్రదర్శన చేశాం: శ్రేయస్ అయ్యర్
Shreyas Iyer,

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌తో మూడో టీ20లోనూ భారత్ పూర్తిగా విఫలమైంది. ఏకంగా 125 పరుగుల భారీ తేడాతో ఘోర ఓటమిని చవి చూసింది. 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 76 పరుగులకే కుప్పకూలి చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఈ విజయంతో ఇంగ్లండ్ 2-0 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టు ఓటమిపై మాట్లాడుతూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అత్యంత దారుణమైన ప్రదర్శన చేశామని, అదే తమ పతనానికి కారణమైందని వెల్లడించాడు.


‘ఇది అత్యంత దారుణమైన ప్రదర్శన. ఇంత భారీ తేడాతో ఓడిపోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈ పిచ్‌పై హార్డ్ లెంగ్త్ బంతులు బౌలర్లకు అనుకూలించాయి. కానీ మేం మా ప్రణాళికలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాం. లక్ష్యాన్ని ఛేదించే సమయంలో సరైన విధానం పాటించలేకపోయాం. ట్రెంట్ బ్రిడ్జ్ వంటి పిచ్‌పై బౌలర్లు 200 పరుగులు ఇవ్వడం సరికాదు. లక్ష్య ఛేదనలో పవర్ ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోయాం. అదే మమ్మల్ని దెబ్బతీసింది. టీమ్ మీటింగ్‌లో చాలా ప్రణాళికలు వేయొచ్చు. కానీ.. మైదానంలోకి వచ్చాక పరిస్థితులకు తగినట్లు మారాలి. ఓడిపోయామని బాధతో ఇక్కడే కూర్చుంచే ప్రయోజనం లేదు. ఓటమిని అంగీకరించి.. బలంగా పుంజుకోవాలి’ అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.


ఈ పరాజయంతో 2019లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన 80 పరుగుల ఓటమిని భారత్ అధిగమించి, టీ20ల్లో పరుగుల పరంగా అత్యంత భారీ ఓటమిని నమోదు చేసింది. గత నెలలో ఐర్లాండ్ చేతిలో 2-0తో సిరీస్ కోల్పోయిన భారత్‌కు ఇది మరో గట్టి ఎదురుదెబ్బగా మారింది. శ్రేయస్ అయ్యర్ జట్టు పగ్గాలు చేపట్టిన తర్వాత టీమిండియా ఇంకా ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేదు.


ఇవి కూడా చదవండి:

45వ పడిలోకి ‘తలా’.. ప్రపంచకప్ వేదికగా ఫిఫా వినూత్న శుభాకాంక్షలు!

తప్పుడు వార్తలపై సూర్యకుమార్ యాదవ్ ఫైర్!

Updated Date - Jul 08 , 2026 | 07:18 AM