తప్పుడు వార్తలపై సూర్యకుమార్ యాదవ్ ఫైర్!
ABN , Publish Date - Jul 07 , 2026 | 05:43 PM
తన గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టీమిండియా మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. అవన్నీ కేవలం కల్పితాలేనని, అసత్య వార్తలను నమ్మోద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: జింబాబ్వేతో జరగబోయే 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోనే జట్టు ఈ పర్యటనను కొనసాగించనుంది. ఇటీవల ముగిసిన 2026 టీ20 ప్రపంచకప్ టైటిల్ను అందించిన అప్పటి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో అయ్యర్ జట్టు పగ్గాలు చేపట్టాడు. గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్లో ఫామ్ కోల్పోయి పరుగుల కోసం ఇబ్బంది పడుతుండటమే సూర్యకుమార్ (SKY) ని సెలెక్టర్లు పక్కన పెట్టడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
జట్టులో చోటు దక్కనప్పటికీ సూర్యకుమార్ యాదవ్ తన క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు. ఎక్స్ వేదికగా టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. 'భారత జట్టును చూస్తే చాలా సంతోషంగా ఉంది. వారికి ఎల్లప్పుడూ నా బెస్ట్ విషెస్ ఉంటాయి. కుర్రాళ్లంతా మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నారు. వారికి నా పూర్తి మద్దతు ఎప్పటికీ ఉంటుంది' అని స్కై పేర్కొన్నాడు.
వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీని సూర్యకుమార్ ప్రత్యేకంగా అభినందించాడు. 'వైభవ్.. నీదొక అద్భుతమైన ప్రయాణం. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ దేశం గర్వించేలా రాణించు' అని సూర్య తెలిపాడు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో తన పేరిట ప్రచారంలో ఉన్న కొన్ని తప్పుడు వ్యాఖ్యలపై సూర్యకుమార్ స్పష్టతనిచ్చాడు. 'నా ప్రమేయం లేకుండా నా పేరుతో కొన్ని తప్పుడు ప్రకటనలు ఆన్లైన్లో తిరుగుతున్నాయి. అవి తప్పుడు వార్తలు.. వాటిని ఎవరూ నమ్మవద్దు, అలానే షేర్ చేయవద్దు. భారత క్రికెట్, నా సహచర ఆటగాళ్లపై నాకున్న గౌరవం ఎప్పుడూ మాటల కంటే చేతల్లోనే కనిపిస్తుంది' అని రూమర్లకు చెక్ పెట్టారు.
ఇవి కూడా చదవండి:
అఫ్గాన్ క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్ కన్నుమూత
సంజూ శాంసన్కు అండగా నిలిచిన అజింక్య రహానే