Share News

బీసీసీఐ ఇచ్చిన హామీ నెరవేరలేదు.. ర్యాన్ టెన్ జట్టును వీడటంపై కొత్త ప్రచారం!

ABN , Publish Date - Jul 15 , 2026 | 11:22 AM

ఇంగ్లండ్‌తో సిరీస్ అనంతరం భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే తన పదవికి రాజీనామా చేస్తాడన్న అంశంపై మరో కొత్త ప్రచారం మొదలైంది. బీసీసీఐ అతడికి ఇచ్చిన హామీ ఇంకా తీర్చలేదని ర్యాన్ అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

బీసీసీఐ ఇచ్చిన హామీ నెరవేరలేదు.. ర్యాన్ టెన్ జట్టును వీడటంపై కొత్త ప్రచారం!
Ryan ten Doeschate

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌తో సిరీస్ అనంతరం భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే తన పదవికి రాజీనామా చేస్తాడన్న అంశంపై మరో కొత్త ప్రచారం మొదలైంది. బీసీసీఐ అతడికి ఇచ్చిన హామీ ఇంకా తీర్చలేదని ర్యాన్ అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అతడి ఒప్పందం ముగియక ముందే జట్టును వీడేందుకు బీసీసీఐ అనుమతి ఇస్తుందా? లేదా? అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. కాగా ర్యాన్ టెన్ జట్టును వీడాలని టీమ్ మేనేజ్‌మెంట్‌కు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.


గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన సమయంలో ర్యాన్ టెన్ సహాయ కోచ్‌గా నియమించారు. అదే సమయంలో అతడికి ఫీల్డింగ్ కోచ్ బాధ్యతలు కూడా అప్పగిస్తామని బీసీసీఐ హామీ ఇచ్చినట్లు సమాచారం. కానీ అప్పటికే రాహుల్ ద్రవిడ్ హయాంలో ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేస్తున్న టీ. దిలీప్‌ను ఆ బాధ్యతల్లో కొనసాగించారు. దీంతో రెండేళ్లు గడిచినా ర్యాన్ టెన్‌కు ఇచ్చిన హామీ నెరవేరలేదు. ఒక దశలో దిలీప్‌ను సపోర్ట్ స్టాఫ్ నుంచి తప్పించాలని బీసీసీఐ భావించినప్పటికీ, భారత జట్టులోని ఓ సీనియర్ ఆటగాడి సిఫారసుతో అతడికి మరో ఏడాది పొడిగింపు లభించినట్లు సమాచారం. దీంతో ర్యాన్‌కు ప్రత్యేక బాధ్యతలే లేకుండా పోయాయని బీసీసీఐ వర్గాలు వెల్లడించినట్లు నివేదిక పేర్కొంది.


‘బ్యాటింగ్ కోచ్‌గా సితాన్షు కోటక్ ఉన్నారు. గౌతమ్ గంభీర్ కూడా బ్యాటర్లతో పనిచేస్తున్నారు. పేస్ బౌలర్ల బాధ్యతలు మోర్నే మోర్కెల్, స్పిన్నర్ల బాధ్యతలు సైరాజ్ బహుతులే చూస్తున్నారు. ర్యాన్‌ను తీసుకొచ్చినప్పుడు ఫీల్డింగ్ కోచ్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ అది జరగలేదు. ర్యాన్ అద్భుతమైన కోచ్. కానీ అతడి నైపుణ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోయాం’ అని బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించినట్లు సమాచారం. ప్రస్తుతం గౌతమ్ గంభీర్ కోచింగ్ బృందంలో ఫీల్డింగ్ కోచ్ బాధ్యతల విషయంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా టీ. దిలీప్ లేదా ర్యాన్ టెన్ ఇద్దరిలో ఒక్కరినే కొనసాగించే అవకాశం ఉందని క్రికెట్ వర్గాల్లో చర్చ సాగుతోంది.


ఇవి కూడా చదవండి:

ఇంగ్లండ్‌తో తొలి వన్డే: కోహ్లీ అరుదైన ఘనత.. పలు రికార్డులు బద్దలు కొట్టిన భారత్

ఫిఫా ప్రపంచ కప్.. మాకు ఫైనల్‌కు వెళ్లే అర్హత లేదు: ఎంబాపె

Updated Date - Jul 15 , 2026 | 11:22 AM