ఐపీఎల్ కోసం సహజ శైలిని మార్చుకోవద్దు.. మానవ్ సుతార్కు పుజారా సూచన
ABN , Publish Date - Aug 20 , 2026 | 03:19 PM
శ్రీలంకతో తొలి టెస్టులో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ 10 వికెట్లతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా.. సుతార్కు కీలక సూచన చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకతో తొలి టెస్టులో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గాలే వేదికగా జరిగిన మ్యాచ్లో తొలి ఇన్సింగ్స్లో 4, రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్లతో.. మొత్తంగా 10 వికెట్లు తీసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. శ్రీలంకపై తొలి టెస్టులో భారత్ 165 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. జూన్లో అఫ్గానిస్థాన్పై టెస్టు అరంగేట్రం చేసిన సుతార్కు.. ఇది రెండో టెస్టు మ్యాచ్ మాత్రమే. తొలి మ్యాచ్లోనే ఐదు వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటిన మానవ్ సుతార్.. ఇప్పుడు శ్రీలంకపై చెలరేగి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా.. సుతార్కు కీలక సూచన చేశాడు.
‘యువ ఆటగాళ్లు పొట్టి ఫార్మాట్ ఆడాలని కోరుకోవడం సహజమే. అయితే మానవ్ సుతార్ను టెస్టు క్రికెట్ కోసం కాపాడుకోవాలి. ఐపీఎల్లో అవకాశం వస్తే ఆడొచ్చు. కానీ అందుకోసం తన బలాలను, సహజ శైలిని మార్చుకోవద్దు. మానవ్ సుతార్ బంతికి మంచి ఫ్లెట్ ఇస్తాడు. కొంచెం నెమ్మదిగా బౌలింగ్ చేయడానికి కూడా అతడు వెనకాడడు. అదే అతడి బలం కూడా. టెస్టు క్రికెట్లో ఈ లక్షణాలు ఉన్న ప్లేయర్ అవసరం. ఐపీఎల్ కోసం సహజ ప్రతిభను మార్చుకోవద్దు. ఐపీఎల్ ఆడటాన్ని నేను ఎప్పుడూ వ్యతిరేకించను. కానీ టెస్టు క్రికెట్లో తన ప్రత్యేకతను కోల్పోకూడదు’ అని పుజారా సూచించాడు.
రాజస్థాన్కు చెందిన మానవ్ సుతార్ ఇప్పటివరకు ఐపీఎల్లో ఐదు మ్యాచ్లు ఆడి రెండు వికెట్లు తీశాడు. ప్రస్తుతం శుభ్మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ జట్టులో అతడు సభ్యుడిగా ఉన్నాడు. గాలే టెస్టులో 10 వికెట్ల ప్రదర్శనతో సుతార్ టెస్టు క్రికెట్లో తన స్థానాన్ని మరింత బలపరుచుకున్నాడు. తన సహజ బౌలింగ్ శైలిని కొనసాగిస్తే భారత టెస్టు జట్టులో అతడు కీలక స్పిన్నర్గా ఎదిగే అవకాశాలు ఉన్నాయంటూ మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
శ్రీలంకపై ఘన విజయం.. డబ్ల్యూటీసీ పట్టికలో భారత్ స్థానం ఇదే!