Share News

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: క్వార్టర్ ఫైనల్‌కు ట్రీసా-గాయత్రి జోడీ

ABN , Publish Date - Aug 20 , 2026 | 02:43 PM

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్లు ట్రీసా జాలీ-గాయత్రి గోపిచంద్ సంచలనం సృష్టించారు. రౌండ్ ఆఫ్ 16లో జపాన్ జంటపై వరుస గేమ్‌ల్లో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు.

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: క్వార్టర్ ఫైనల్‌కు ట్రీసా-గాయత్రి జోడీ
Treesa Jolly, Gayatri Gopichand

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్లు ట్రీసా జాలీ-గాయత్రి గోపిచంద్ సంచలనం సృష్టించారు. గురువారం జరిగిన మహిళల డబుల్స్ రౌండ్ ఆఫ్ 16లో జపాన్ జంట రెన్ ఇవానగా- కీ నకనిషిపై 21-16, 21-12 తేడాతో వరుస గేమ్‌ల్లో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. దీంతో భారత జోడీ పతకానికి మరింత చేరువైంది.


ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 39వ స్థానంలో ఉన్న గాయత్రి-ట్రీసా జోడీ ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. ట్రీసా తన పవర్‌ఫుల్ జంప్ స్మాష్‌లతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కరి చేయగా.. గాయత్రి ఫ్రంట్ కోర్టులో అద్భుతంగా ఆడి పాయింట్లను సెట్ చేసింది. వీరిద్దరి కోర్టు రొటేషన్స్ కూడా ప్రత్యర్థి జోడీకి ఇబ్బందులు కలిగించాయి. మ్యాచ్‌ మధ్యలో లైన్‌ కాల్స్‌ విషయంలో అంపైర్‌తో భారత ఆటగాళ్లకు స్వల్ప వాగ్వాదం జరిగింది. షటిల్‌ను ఉద్దేశపూర్వకంగా కొట్టినందుకు ట్రీసాకు ఎల్లో కార్డు కూడా లభించింది. అయితే కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ సూచనలతో గాయత్రి–ట్రీసా ప్రశాంతంగా వ్యవహరించి మ్యాచ్‌పై దృష్టి పెట్టారు.


చైనాతో అమీతుమీ..

క్వార్టర్‌ ఫైనల్లో భారత జోడీ చైనాకు చెందిన ప్రపంచ నంబర్‌ 4 జియా యి ఫాన్–జాంగ్ షు షియాన్‌తో తలపడనుంది. ఇప్పటివరకు ఈ చైనా జోడీతో గాయత్రి–ట్రీసా మూడు సార్లు తలపడగా.. ఒక్కసారి కూడా గెలుపు రుచి చూడకపోవడం గమనార్హం. అయితే ప్రస్తుత ఫామ్‌ను కొనసాగించి విజయం సాధిస్తే భారత జోడీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం ఖాయం చేసుకుంటుంది. దాంతోపాటు చైనాతో ఓటముల పరంపరకు కూడా తెర పడినట్లు అవుతుంది.


భారత మహిళల డబుల్స్‌లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పతకం సాధించిన చివరి జోడీ జ్వాలా గుత్తా-అశ్విని పొన్నప్ప. 2011లో వారు ఈ ఘనత సాధించారు. గాయత్రి-ట్రీసా క్వార్టర్‌ ఫైనల్లో గెలిస్తే, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన రెండో భారత మహిళల డబుల్స్‌ జోడీగా చరిత్ర సృష్టిస్తారు. శుక్రవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్‌లో చైనా జోడీని ఓడిస్తే గాయత్రి గోపీచంద్–ట్రీసా జాలీ భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో మరో అరుదైన అధ్యాయాన్ని లిఖించనున్నారు.


ఇవి కూడా చదవండి:

శ్రీలంకపై ఘన విజయం.. డబ్ల్యూటీసీ పట్టికలో భారత్ స్థానం ఇదే!

పాక్‌ పని పట్టారు

Updated Date - Aug 20 , 2026 | 02:45 PM