పాక్ టీమ్ భారత్కు పోటీ ఇచ్చే పరిస్థితుల్లో లేదు: సంజయ్ మంజ్రేకర్
ABN , Publish Date - Feb 03 , 2026 | 04:39 PM
భారత్తో పాక్ ఆడటంపై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాక్ టీమ్ బలహీనంగా ఉందని.. టీమిండియాకు పోటీ ఇచ్చే పరిస్థితుల్లో లేదని అభిప్రాయపడ్డాడు. భారత్తో మ్యాచ్ ఆడకపోయినా ఫర్వాలేదని అన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఫిబ్రవరి 7 నుంచి టీ-20 ప్రపంచ కప్-2026 ప్రారంభం కానుంది. దీనికి భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. అయితే బంగ్లాను ఈ మెగా టోర్నీ నుంచి ఐసీసీ తప్పించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్కు మద్దతుగా పాకిస్థాన్ కూడా ఈ టోర్నీ నుంచి తప్పుకోవాలని ప్రయత్నించింది. కానీ ఆ దేశ ప్రభుత్వ నిర్ణయం మేరకు ప్రపంచ కప్ ఆడుతామని, కానీ భారత్తో మ్యాచులు ఆడబోమని పీసీబీ ప్రకటించింది. ఈ విషయంపై తీవ్ర దుమారం చెలరేగింది. భారత్తో మ్యాచులు బహిష్కరిస్తే పాక్.. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఐసీసీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్(Sanjay Manjrekar) కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘భారత్-పాక్(Ind vs Pak) మ్యాచ్ జరగకున్నా ఫర్వాలేదు. చాలాకాలంగా భారత్, పాక్ మధ్య మ్యాచులు రసవత్తరంగా సాగడం లేదు. పూర్తిగా ఏకపక్షంగా ఫలితాలు వస్తున్నాయి. కారణం.. పాక్ జట్టు 90వ దశకంలో ఉన్నట్టుగా బలంగా లేదు. ఇప్పుడు ఆ టీమ్ చాలా బలహీనంగా ఉంది. అసలు భారత్కు పోటీ ఇచ్చే పరిస్థితే లేదు. భారత్ ఆ టీమ్తో తలపడుతుంటే.. ఏదో చిన్న జట్టుతో మ్యాచ్ ఆడుతున్న ఫీల్ ఉంటోంది. భారత్-పాక్ పోరు కంటే కూడా టీమిండియాతో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు తలపడుతుంటేనే ఉత్కంఠభరితంగా ఉంటోంది’ అని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.
ఇవి కూడా చదవండి:
అప్పుడు హాకీ.. ఇప్పుడు క్రికెట్.. అరుదైన ఘనత సాధించిన ఇటలీ కెప్టెన్
అభిమానులకు క్రేజీ న్యూస్.. డబ్ల్యూపీఎల్లో అడుగుపెట్టనున్న చెన్నై సూపర్ కింగ్స్!