వైభవ్ సూర్యవంశీకి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు: కైఫ్
ABN , Publish Date - Jun 30 , 2026 | 07:40 AM
భారత జట్టుపై ఐర్లాండ్ 2-0 తేడాతో టీ20 సిరీస్ను క్లీన్స్వీప్ సంగతి తెలిసిందే. ఇందులో వైభవ్ సూర్యవంశీని ఎందుకు ఆడించలేదు? అనే చర్చ కొనసాగుతోంది. టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఈ విషయంపై స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత జట్టుపై ఐర్లాండ్ 2-0తో టీ20 సిరీస్ను క్లీన్స్వీప్ సంగతి తెలిసిందే. రెండో టీ20 ముగిసి రెండు రోజులు అయినా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఎందుకు ఆడించలేదు? అనే చర్చ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ అంశంపై పలువురు మాజీ క్రికెటర్లు టీమ్ మేనేజ్మెంట్పై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా మరో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఈ విషయంపై స్పందించాడు. భారత జట్టు యాజమాన్యం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందంటూ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని కోచింగ్ సిబ్బందిపై విమర్శలు గుప్పించాడు.
‘అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్ గురించి మాట్లాడితే వైభవ్ సూర్యవంశీకి జట్టులో స్థానం ఉండాల్సిందే. ప్రపంచ కప్ విజేతగా నిలిపిన జట్టునే కొనసాగిస్తామని, అందుకే వైభవ్ ఇంకాస్త సమయం వేచి ఉండాల్సిందేనని మేనేజ్మెంట్ ఏదో లాజిక్ చెప్పింది. తొలి మ్యాచ్లో ఓపెనర్ సంజు శాంసన్, ఇషాన్ కిషన్ బాగా ఆడలేదు. రెండో మ్యాచ్లో ఓపెనర్లు ఇద్దరూ డకౌట్. గతంలో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ విషయంలో కఠినంగా వ్యవహరించిన మేనేజ్మెంట్ ఈసారి మాత్రం ఉదాసీనంగా వ్యవహరించింది. ఐపీఎల్, శ్రీలంక పర్యటనల్లో అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వలేదు. రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీని అందించిన తర్వాత అతడిని సారథ్యం నుంచి తప్పించారు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నామని అప్పుడు చెప్పారు. సూర్యకుమార్ విషయంలోనూ అదే జరిగింది. టీ20 ప్రపంచ కప్ను అందించిన కెప్టెన్ అతడు. అతడినే తప్పించినప్పుడు, మరి 15 ఏళ్ల కుర్రాడికి మాత్రం ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు? భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నప్పుడు బాగా ఆడేవారినే బరిలోకి దింపాలి కదా’ అని కైఫ్ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
ఒలింపిక్స్2028... టీమిండియా అభిమానులకు శుభవార్త!
భారత్పై చరిత్రాత్మక విజయం.. ఐర్లాండ్ కోచ్ సంచలన నిర్ణయం