ఎంసీఏ కీలక నిర్ణయం.. వాంఖడే లాంజ్లకు సచిన్, రహానె పేర్లు
ABN , Publish Date - Sep 12 , 2026 | 12:29 PM
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మాజీ క్రికెటర్ అజింక్య రహానెలకు అరుదైన గౌరవం దక్కనుంది. ముంబైలోని ప్రతిష్ఠాత్మక వాంఖడే స్టేడియంలోని లాంజ్లకు సచిన్, రహానెతో పాటు దివంగత మాధవ్ మంత్రి పేర్లు పెట్టాలని ఎంసీఏ నిర్ణయించింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మాజీ క్రికెటర్ అజింక్య రహానెలకు అరుదైన గౌరవం దక్కనుంది. వార్షిక సర్వసభ్య సమావేశంలో ముంబై క్రికెట్ సంఘం(ఎంసీఏ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముంబైలోని ప్రతిష్ఠాత్మక వాంఖడే స్టేడియంలోని లాంజ్లకు సచిన్, రహానెతో పాటు దివంగత మాధవ్ మంత్రి పేర్లు పెట్టాలని నిర్ణయించింది.
అదే సమయంలో ఎంసీఏ అనుబంధ క్లబ్లకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు సబ్సిడీ కార్పస్ను వచ్చే పదేళ్లలో ఏకంగా రూ.500 కోట్లకు పెంచాలని నిర్ణయించింది. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రూ.100 కోట్ల సబ్సిడీ కార్పస్ ఏర్పాటుకు ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. తాజాగా దానిని రూ.500 కోట్లకు పెంచడం గమనార్హం.
ముగ్గురికీ ప్రత్యేక గౌరవం
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్తో పాటు ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన అజింక్య రహానెకు వాంఖడేలో ప్రత్యేక లాంజ్లను కేటాయించనున్నారు. ముంబై మాజీ కెప్టెన్, ఎంసీఏ అధ్యక్షుడిగా పనిచేసిన మాధవ్ మంత్రి పేరును కూడా ఓ లాంజ్కు పెట్టనున్నారు. మంత్రి భారత్ తరఫున నాలుగు టెస్టులు ఆడారు. ‘వారికి ప్రత్యేకంగా లాంజ్లను కేటాయించాలని నిర్ణయించాం. ఇందుకోసం కార్యదర్శులతో కలిసి ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశాం’ అని ఎంసీఏ అధ్యక్షుడు అజింక్య నాయక్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఇంట్లో విషాదం
యూఎస్ ఓపెన్: టియాఫో చిత్తు.. ఫైనల్కు దూసుకెళ్లిన బెన్ షెల్టన్