Share News

పరాగ్ కెప్టెన్ ఎలా అయ్యాడో అందరికీ తెలుసు: క్రిస్ శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 24 , 2026 | 09:43 AM

ఆర్ఆర్ జట్టుకు కెప్టెన్‌గా రియాన్ పరాగ్‌ను నియమించిన సంగతి తెలిసిందే. అయితే టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రియాన్ పరాగ్‌ను కెప్టెన్ చేయడంపై ఆయన ఘాటుగా స్పందించాడు.

పరాగ్ కెప్టెన్ ఎలా అయ్యాడో అందరికీ తెలుసు: క్రిస్ శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు
Kris Srikkanth

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. సుదీర్ఘ కాలంగా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సంజు శాంసన్.. ఈ సీజన్‌లో ట్రేడ్ డీల్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. సీఎస్కే నుంచి సామ్ కరన్, రవీంద్ర జడేజా ఆర్ఆర్‌కు వచ్చారు. దీంతో ఆర్ఆర్ జట్టుకు కెప్టెన్‌గా రియాన్ పరాగ్‌ను నియమించారు. అయితే టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రియాన్ పరాగ్‌ను కెప్టెన్ చేయడంపై ఆయన ఘాటుగా స్పందించాడు.


‘అతడు కెప్టెన్ ఎలా అయ్యాడో అందరికీ తెలుసు. అది వారి నిర్ణయం కావొచ్చు.. కానీ జట్టులో మాత్రం అతడిని రాజులా చూస్తున్నారు. గత సీజన్‌లో పరాగ్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. నిలకడ లేమి అతడి కెరీర్‌లో పెద్ద సమస్యగా మారింది. గతంలో జట్టును నడిపిన సంజు శాంసన్‌ను రూ.18కోట్లకు సీఎస్కే ట్రేడ్ చేసిన తర్వాత ఆర్ఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం మరింత ఆశ్చర్యంగా ఉంది. జట్టులో అనుభవం ఉన్న యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా వంటి ప్లేయర్లు ఉన్నప్పటికీ వారిని పక్కన పెట్టి పరాగ్‌కు కెప్టెన్సీ ఇవ్వడం సరైన నిర్ణయయా?


గతంలో సంజు గాయపడినప్పుడు పరాగ్ కెప్టెన్సీ చేశాడు కాబట్టి అతడికి అనుభవం ఉందనేది వాదన. అయితే పరాగ్ కెప్టెన్సీలో ఆర్ఆర్ 8 మ్యాచులు ఆడి కేవలం రెండింట్లోనే విజయం సాధించింది. అయినప్పటికీ అతడి మీద ఫ్రాంచైజీ నమ్మకం ఉంచడం విశేషం. వ్యక్తిగతంగా బ్యాటింగ్ పరంగా చూస్తే పరాగ్ చక్కటి స్ట్రైక్ రేట్‌తో ఆడతాడు కానీ అదే నిలకడను కొనసాగించలేడు. మరోవైపు రాజస్థాన్ జట్టు ఈ సీజన్‌లో పరాగ్ కెప్టెన్సీలో ఎలాంటి ప్రదర్శనలు చేస్తుందో చూడాలి. ఆర్ఆర్ అత్యంత ప్రమాదకరమైన జట్టు అయితే కాదు.. కానీ పెద్ద జట్లను ఓడించే సామర్థ్యం ఉంది. ముఖ్యంగా యశస్వి జైస్వాల్-వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ జోడీ జట్టుకు ప్రధాన బలం. మొత్తంగా చూస్తే ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరడానికి 50-50 అవకాశాలు మాత్రమే ఉన్నాయి’ అని శ్రీకాంత్ తేల్చి చెప్పాడు.


ఇవి కూడా చదవండి:

పాక్ చేతిలో ఓడితే.. మా అభిమానులు ఆత్మహత్య చేసుకుంటారు: అఫ్గాన్ క్రికెటర్

షెడ్యూల్ ప్రకారమే లీగ్.. ఆ వార్తల్లో నిజం లేదు: ఐపీఎల్

Updated Date - Mar 24 , 2026 | 10:21 AM