జెమీమా రోడ్రిగ్స్కు బిగ్ షాక్
ABN , Publish Date - Jan 28 , 2026 | 02:50 PM
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ కు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. డబ్ల్యూపీఎల్-2026 డీసీ జట్టు సారథిగా ప్రమోషన్ పొందిన జెమీమాకు నిన్న గుజరాత్ తో జరిగిన మ్యాచులో భారీ జరిమానా పడింది.
స్పోర్ట్స్ డెస్క్: భారత మహిళా జట్టు స్టార్ ప్లేయర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్కు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. డబ్ల్యూపీఎల్-2026 డీసీ జట్టు సారథిగా ప్రమోషన్ పొందిన జెమీమా.. కెప్టెన్గా ఆకట్టుకోలేకపోతోంది. ఇప్పటికే ఈ టీమిండియా స్టార్ సారథ్యంలో వరుస పరాజయాలు చవిచూసిన ఢిల్లీ జట్టు.. తాజాగా మంగళవారం గుజరాత్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లోనూ స్వల్ప పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా ఇప్పటికి ఏడు మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఢిల్లీ ఖాతాలో నాలుగో పరాజయం నమోదైంది.
గుజరాత్ చేతిలో ఓటమితో షాక్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్కు మరో బిగ్ షాక్ తగిలింది. స్లో ఓవర్ కారణంగా ఆమెకు జరిమానా పడింది. గుజరాత్తో మ్యాచ్లో నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందున జెమీమాకు రూ. 12 లక్షల జరిమానా పడింది. ఈ విషయాన్ని డబ్ల్యూపీఎల్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
‘వడోదర వేదికగా మంగళవారం గుజరాత్ జెయింట్స్తో మ్యాచ్లో స్లో ఓవర్ కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్కు జరిమానా విధించడమైనది. ఈ సీజన్లో ఆమె స్లో ఓవర్ రేట్ మెయింటెన్ చేయడం ఇదే తొలిసారి. కావున డబ్ల్యూపీఎల్ నిబంధనల ప్రకారం రూ. 12 లక్షల జరిమానాతో సరిపెట్టాము’ అని డబ్ల్యూపీఎల్ యాజమాన్యం పేర్కొంది. ప్రపంచ కప్-2025 సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో జెమీమా (127 పరుగులు)అద్భుతమైన బ్యాటింగ్ తో ఓవర్ నైట్ స్టార్ అయింది.
ఇంకా చెప్పాలంటే.. ఆ మ్యాచుతోనే జెమీమా గురించి ప్రపంచానికి బాగా తెలిసింది. ప్రపంచ కప్లో వచ్చిన ఫేమ్తో ఆమెకు డబ్ల్యూపీఎల్లో ప్రమోషన్ వచ్చింది. ఢిల్లీ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సీజన్లో ఢిల్లీకి కప్ అందించాలని జెమీమా భావించింది. అయితే అందుకు భిన్నంగా ఢిల్లీ ఓటములు చవిచూస్తుంది. ప్రస్తుతం పాయింట్స్ పట్టికలో డీసీ నాలుగో స్థానంలో ఉంది. తన చివరి మ్యాచ్ యూపీ వారియర్స్తో ఫిబ్రవరి 1న తలపడనుంది.
ఇవి కూడా చదవండి:
'అతను నిస్వార్థపరుడు'.. అభిషేక్ శర్మపై మంజ్రేకర్ ప్రశంసలు..
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో టీమిండియా మాజీ క్రికెటర్ అరెస్ట్