ఇప్పట్లో మైదానంలోకి దిగడం కష్టమే.. బుమ్రా, హార్దిక్ గాయాలపై అప్డేట్!
ABN , Publish Date - Aug 08 , 2026 | 12:32 PM
శ్రీలంకతో టెస్టు సిరీస్కు ముందు టీమిండియాకు గాయాల బెడద తప్పడం లేదు. అయితే ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో గాయపడిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, మరో ప్లేయర్ హార్దిక్ పాండ్య గాయాలపై తాజాగా సమాచారం బయటకు వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకతో టెస్టు సిరీస్కు ముందు టీమిండియాకు గాయాల బెడద తప్పడం లేదు. భారత జట్టుకు ఇప్పుడు ఆడుతున్నవారు, భవిష్యత్తులో ఎంపికయ్యే అవకాశం ఉన్న 13 మంది ప్లేయర్లు ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరావాసం పొందుతున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. అయితే ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో గాయపడిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, మరో ప్లేయర్ హార్దిక్ పాండ్య గాయాలపై తాజాగా సమాచారం బయటకు వచ్చింది.
బుమ్రా ఎడమ మోకాలిలో వాపుతో ఇబ్బంది పడుతున్నాడు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో జాగింగ్, ఒక కాలితో చేసే వ్యాయామాల సమయంలో అతడికి అసౌకర్యం ఎదురైనట్లు తెలుస్తోంది. దీంతో బుమ్రా తిరిగి మైదానంలోకి వచ్చే విషయంపై ఇప్పుడే క్లారిటీ వచ్చే అవకాశం లేదు. బుమ్రా కోలుకోవడానికి ఇంకొంత సమయం పట్టొచ్చని తెలుస్తోంది. మరోవైపు హార్దిక్ పాండ్యకు కూడా రికవరీ సమయంలో కొత్త సమస్య ఎదురైనట్లు సమాచారం. తొడ కండరాల గాయం నుంచి కోలుకుంటున్న హార్దిక్.. పూర్తిస్థాయిలో బౌలింగ్ ప్రాక్టీస్ ప్రారంభించిన తర్వాత మోకాలి నొప్పి వచ్చింది. వైద్య పరీక్షల్లో పెద్ద సమస్యగా కనిపించకపోయినా.. ముందు జాగ్రత్తగా పరుగెత్తడం, బౌలింగ్ చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. అయితే చికిత్సకు హార్దిక్ బాగా స్పందిస్తున్నాడని వైద్యులు తెలిపారు. త్వరలోనే తన బౌలింగ్ భారాన్ని కూడా క్రమంగా పెంచుకునే అవకాశం ఉందని పేర్కొంది.
ఇక టీమిండియా టెస్టు కెప్టెన్ శుభ్మన్ గిల్కు కూడా గాయం కలకలం రేపింది. శ్రీలంక XIతో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్కు ముందు గురువారం ప్రాక్టీస్లో కుడి చేతి బొటన వేలికి గాయం అయింది. దీంతో గిల్ స్థానంలో కేఎల్ రాహుల్ జట్టును నడిపిస్తున్నాడు. రెండో రోజు మైదానంలోకి దిగుతాడని భావించినా.. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల గిల్ ఆడట్లేదు. ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి శ్రీలంక పర్యటనకు దూరమయ్యారు. వాషింగ్టన్ సుందర్, సాయి సుదర్శన్ ఫిట్నెస్పైనా అనుమానాలు కొనసాగుతున్నాయి. దీంతో శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్కు ముందు టీమిండియాకు గాయాల సమస్య పెద్ద సవాలుగా మారింది. భారత్-శ్రీలంక రెండు టెస్టుల సిరీస్ ఆగస్టు 15న గాలే వేదికగా ప్రారంభం కానుంది.
ఇవి కూడా చదవండి:
ఫిఫా ప్రపంచ కప్లో మెస్సి హ్యతకు కుట్ర.. వెలుగులోకి సంచలన విషయాలు!
రెడ్ బాల్ క్రికెట్పై వైభవ్ సూర్యవంశీ ఫోకస్.. టెస్టుల్లో సత్తా చాటుతాడా?