రెడ్ బాల్ క్రికెట్పై వైభవ్ సూర్యవంశీ ఫోకస్.. టెస్టుల్లో సత్తా చాటుతాడా?
ABN , Publish Date - Aug 08 , 2026 | 10:04 AM
15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసి సంచలనాలు సృష్టిస్తున్న యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు రెడ్ బాల్ క్రికెట్పై దృష్టి పెట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసి సంచలనాలు సృష్టిస్తున్న యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు రెడ్ బాల్ క్రికెట్పై దృష్టి పెట్టాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 776 పరుగులు చేసిన వైభవ్.. ఆరెంజ్ క్యాప్తో పలు అవార్డులను సొంతం చేసుకున్నాడు. అంతకుముందు అండర్-19 ప్రపంచ కప్లోనూ 439 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచాడు. ఈ ప్రదర్శనలతో అతి పిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన వైభవ్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే పొట్టి ఫార్మాట్లో అదరగొడుతున్న అతడు.. టెస్టు క్రికెట్లో రాణించగలడా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
భారీ షాట్లకు అలవాటు పడిన వైభవ్.. సుదీర్ఘ ఫార్మాట్లో సత్తా చాటుతాడా? అని మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎర్ర బంతిని ఎదుర్కొనే విషయంలో అతడి టెక్నిక్ను పరీక్షించాల్సి ఉంది. గత రంజీ సీజన్లో ఎనిమిది మ్యాచ్లు ఆడిన వైభవ్ కేవలం 207 పరుగులు మాత్రమే చేశాడు. 17.25 సగటుతో ఒక అర్ధ శతకం కూడా సాధించలేకపోయాడు. అతడి అత్యధిక స్కోరు 83. అయినప్పటికీ వైభవ్ వెనక్కి తగ్గడం లేదు. సుదీర్ఘ ఫార్మాట్లో తనను తాను నిరూపించుకునేందుకు కసరత్తు చేస్తున్నాడు. త్వరలో జరగనున్న దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జట్టుకు ఇషాన్ కిషన్ డిప్యూటీగా వైభవ్కు నాయకత్వ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాగ్పూర్లో రాజస్థాన్ రాయల్స్ నిర్వహిస్తున్న 10 రోజుల క్యాంప్లో రెడ్బాల్ క్రికెట్పై ప్రత్యేకంగా సాధన చేస్తున్నాడు.
టెక్నిక్ను మార్చుకుంటాడా?
టెస్టు క్రికెట్లో రాణించాలంటే సహనం, షాట్ ఎంపికలో స్పష్టత, ఎక్కువసేపు ఏకాగ్రతతో బ్యాటింగ్ చేయడం కీలకం. వైట్బాల్లో పవర్ హిట్టింగ్తో ఆకట్టుకున్న వైభవ్.. సుదీర్ఘ ఫార్మాట్కు అనుగుణంగా తన ఆటను మార్చుకోవాల్సి ఉంటుంది. ఇటీవల జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో 49 బంతుల్లో 83 పరుగులు చేయడం అతడి ఆటలో మార్పును సూచిస్తోంది. సాధారణంగా 220కుపైగా స్ట్రైక్రేట్తో బ్యాటింగ్ చేసే వైభవ్.. ఆ మ్యాచ్లో 169.38 స్ట్రైక్రేట్తో ఆడాడు. వయసు అతడికి అనుకూలంగా ఉన్నప్పటికీ.. టెస్టు క్రికెట్లో విజయవంతం కావాలంటే పవర్ హిట్టింగ్కు మించి తన ఆటను అభివృద్ధి చేసుకోవాలి. అందుకే ప్రస్తుతం వైట్బాల్ క్రికెట్కు దూరంగా రెడ్బాల్ ఆటపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాడు. మరి ఈ కుర్ర సంచలనం టెస్టుల్లోనూ తన ముద్ర వేస్తాడో లేదో చూడాలి.
ఇవి కూడా చదవండి:
స్థలం గిఫ్ట్గా ఇస్తే బాగుంటుంది.. ఉత్తరాఖండ్ సీఎంను ట్యాగ్ చేసి పంత్ ట్వీట్
ధోని, కోహ్లీ కాదు.. అత్యుత్తమ భారత క్రికెటర్ ఎవరంటే?: రహానె