సీఎస్కే వరుస ఓటములకు అతడే ప్రధాన కారణం: ఇర్ఫాన్ పఠాన్
ABN , Publish Date - Apr 06 , 2026 | 05:45 PM
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుస పరాజయాలతో కష్టాల్లో కూరుకుపోయింది. ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ పేలవ ప్రదర్శనలతో ఓటమి చవి చూసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుస పరాజయాలతో కష్టాల్లో కూరుకుపోయింది. ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ పేలవ ప్రదర్శనలతో ఓటమి చవి చూసింది. తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచులో సీఎస్కే బౌలింగ్ విభాగం పూర్తిగా విఫలమైంది. ఆర్సీబీ టాపార్డర్ బీభత్సానికి 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 250 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్లో చెన్నై 207 పరుగులకు ఆలౌటైంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
‘సీఎస్కే సమస్య బ్యాటింగ్లో లేదు.. బౌలింగ్లోనే ఉంది. మరీ ముఖ్యంగా స్పిన్నర్ నూర్ అహ్మద్ ప్రదర్శన అత్యంత దారుణంగా పడిపోయింది. సీఎస్కే వరుస ఓటములకు ప్రధాన కారణం అతడే అనడంలో సందేహమే లేదు. ఈ సీజన్లో దాదాపు 10 ఓవర్లు వేసి 100కి పైగా పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అతడు బంతిని సంధించే విధానంలో కూడా మార్పు వచ్చింది. రన్ అప్ యాంగిల్ సరిగ్గా లేకపోవడం వల్లే అలైన్మెంట్ తప్పుతోంది. చేతి పొజిషన్ కూడా సరిగ్గా ఉండటం లేదు. సీఎస్కేలో బౌలర్లు పరిస్థితులకు తగ్గట్టుగా ఆడలేకపోతున్నారు’ అని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు.
అక్కడ విఫలమయ్యారు..
ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ-సీఎస్కే తలపడ్డాయి. అయితే ఈ మ్యాచులో ఆర్సీబీ ఆల్రౌండర్ టిమ్ డేవిడ్ బీభత్సం సృష్టించాడు. 25 బంతుల్లో ఏకంగా 70 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఈ విషయంపై కూడా ఇర్ఫాన్ మాట్లాడాడు. ‘టిమ్ డేవిడ్ సాధారణంగా లెగ్ స్టంప్ బయట నిలబడి షాట్లు ఆడుతాడు. ఆఫ్ స్టంప్ వైపు బంతులు వేస్తే అతడికి మరింత స్పేస్ ఇస్తున్నట్లే. మిడిల్, లెగ్ స్టంప్లపై బౌలింగ్ చేస్తే అతడి వికెట్ దక్కేది. టిమ్ డేవిడ్ను కట్టడి చేయడంలో సీఎస్కే తీవ్రంగా విఫలమైంది. అదే మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసింది’ అని ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
అందుకే ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించా.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు
ధోనికి ఫిట్నెస్ టెస్ట్.. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్తో బరిలోకి దిగనున్న తలా!