ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ నామినేషన్లు.. జాబితాలో సంజు, బుమ్రా పేర్లు
ABN , Publish Date - Apr 06 , 2026 | 05:09 PM
మార్చి నెలకు సంబంధించి ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు నామినేషన్ల జాబితాను ఐసీసీ తాజాగా వెల్లడించింది. ఇందులో భారత్ నుంచి ఇద్దరు ప్లేయర్లు మాత్రమే చోటు దక్కించుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మార్చి నెలకు సంబంధించి ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు నామినేషన్ల జాబితాను ఐసీసీ తాజాగా వెల్లడించింది. ఇందులో భారత్ నుంచి ఇద్దరు ప్లేయర్లు మాత్రమే చోటు దక్కించుకున్నారు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచ కప్ 2026లో అద్భుత ప్రదర్శనలు కనబర్చిన స్టార్ బ్యాటర్ సంజు శాంసన్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ జాబితాలో నిలిచారు.
టీ20 ప్రపంచ కప్ 2026లో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన సంజు శాంసన్.. కీలక మ్యాచుల్లో అసాధారణ ప్రదర్శన చేశాడు. సూపర్ 8లో అమీ తుమీ తేల్చుకోవాల్సిన మ్యాచ్లో సంజు చెలరేగాడు. బలమైన వెస్టిండీస్పై అజేయంగా 97 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. అనంతరం సెమీ ఫైనల్లో ఇంగ్లండ్పై 89, న్యూజిలాండ్తో ఫైనల్ మ్యాచులోనూ 89 పరుగులు చేసి ఔరా అనిపించాడు. టీమిండియా వరుసగా రెండో సారి టీ20 ప్రపంచ కప్ను గెలవడంలో సంజు కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనలకు గాను సంజు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు కూడా అందుకున్న విషయం తెలిసిందే.
ఇక బౌలింగ్ విభాగంలో స్టార్ పేసర్ బుమ్రా అద్భుతమైన ప్రదర్శనలు చేశాడు. తన కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లో నాలుగు ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి మ్యాచ్ను భారత్ వైపు తిప్పాడు. మొత్తం టోర్నమెంట్లో అతడు 14 వికెట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ కానర్ కూడా ఈ అవార్డు రేసులో నిలిచాడు. న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో అద్భుతంగా ఆడి 200 పరుగులు సాధించాడు.
ఇవి కూడా చదవండి:
అందుకే ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించా.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు
ధోనికి ఫిట్నెస్ టెస్ట్.. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్తో బరిలోకి దిగనున్న తలా!