Share News

అక్షర్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకోవాలి: ఇర్ఫాన్ పఠాన్

ABN , Publish Date - Feb 24 , 2026 | 03:29 PM

జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో భారత్ సెమీస్ ఆశలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో గురువారం చెన్నై వేదికగా జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్ టీమిండియాకు కీలకం కానుంది.

అక్షర్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకోవాలి: ఇర్ఫాన్ పఠాన్
Irfan Pathan

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా మ్యాచ్‌లన్నీ రసవత్తరంగా సాగుతున్నాయి. లీగ్ స్టేజ్‌ను అజేయంగా ముగించిన టీమిండియా.. సూపర్ 8లో తొలి మ్యాచ్‌లోనే సౌతాఫ్రికాపై ఓటమిని చవిచూసింది. అదీనూ 76 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. దీంతో భారత్ నెట్ రన్ రేట్ దారుణంగా పడిపోయింది. ఇదిలా ఉండగా.. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో భారత్ సెమీస్ ఆశలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో గురువారం చెన్నై వేదికగా జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్ టీమిండియాకు కీలకం కానుంది. ఎట్టిపరిస్థితుల్లో భారీ నెట్ రన్ రేట్‌తో టీమిండియా గెలవాల్సి ఉంది. ఈ అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ భారత జట్టుకు పలు కీలక సూచనలు చేశాడు.


‘సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి. ప్రస్తుతం ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్లు తొలుత బ్యాటింగ్‌కు దిగుతున్నారు. దీన్ని మార్చాలంటే సూర్య నం.3లో బ్యాటింగ్ చేయాలి. అలాగే అక్షర్ పటేల్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవాలి. అతడు లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్లను తన బౌలింగ్‌తో చక్కగా నియంత్రించగలడు. అక్షర్‌కు బ్యాటింగ్ నైపుణ్యం కూడా ఉంది.


జింబాబ్వేతో జరగబోయే మ్యాచ్‌లో టీమిండియా కుల్‌దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకోవాలని చూస్తుండొచ్చు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు ముందు అతడిని జింబాబ్వే మ్యాచ్‌లో ఆడించే అవకాశాలున్నాయి. సంజు శాంసన్ గురించి కూడా యాజమాన్యం ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ జట్టులో పెద్దగా మార్పులు చేయకూడదు. తుది జట్టులో ఒక్క మార్పు చేసి, అక్షర్ పటేల్‌ను తీసుకుంటే సరిపోతుంది’ అని ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు.


ఇవి కూడా చదవండి:

ఓడినా.. ప్రపంచ రికార్డు సృష్టించిన జింబాబ్వే ప్లేయర్లు

2026 ఫిఫా వరల్డ్ కప్: మెక్సికోలో హింస.. మ్యాచ్‌ల వేదికల మార్పు తప్పదా?

Updated Date - Feb 24 , 2026 | 03:30 PM