ఐపీఎల్ 2026: టైటిల్కు కేకేఆర్ గట్టి పోటీదారుగా ఉండలేదు.. అనిల్ కుంబ్లే
ABN , Publish Date - Mar 15 , 2026 | 07:05 AM
ఐపీఎల్ 2026 మరికొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే కేకేఆర్ జట్టు పలు అంశాలతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. జట్టులోని కీలక ఆటగాళ్లను వేలానికి ముందు రిటైన్ చేసుకోకుండా వదిలేసింది. ఈ నేపథ్యంలో కేకేఆర్ తీరుపై టీమిండియా మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 మరికొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 28న ఆర్సీబీ-ఎస్ఆర్హెచ్ మ్యాచ్తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఇప్పటికే కేకేఆర్ జట్టు పలు అంశాలతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్ను బీసీసీఐ ఆదేశాల మేరకు జట్టు తప్పించి.. అతడి స్థానంలో జింబాబ్వే పేసర్ ముజరబానీని తీసుకుంది. జట్టులోని కీలక ఆటగాళ్లను వేలానికి ముందు రిటైన్ చేసుకోకుండా వదిలేసింది. ఈ నేపథ్యంలో కేకేఆర్ తీరుపై టీమిండియా మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే స్పందించాడు.
‘శ్రేయస్ అయ్యర్, ఫిల్ సాల్ట్ వంటి కీలక ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడం ఎంత ముఖ్యమన్నది అర్థం చేసుకుంటే తప్ప ఐపీఎల్ టైటిల్కు కేకేఆర్ గట్టి పోటీదారుగా ఉండలేదు. 2024లో శ్రేయస్ నేతృత్వంలో కోల్కతా టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత శ్రేయస్, సాల్ట్ ఆ జట్టును వీడారు. అయ్యర్ పంజాబ్లో చేరగా.. సాల్ట్ ఆర్సీబీకి వెళ్లిపోయాడు. దాదాపు దశాబ్దం విరామం తర్వాత నిరుడు పంజాబ్ ఫైనల్ చేరగా.. ఆర్సీబీ తొలి సారి టైటిల్ గెలుచుకుంది.
‘రెండేళ్ల కింద కేకేఆర్ ఐపీఎల్ విజేతగా నిలిచింది. అయితే మూడోసారి టైటిల్ను గెలుచుకోవడంలో శ్రేయస్ అయ్యర్, ఫిల్ సాల్ట్లదే కీలక పాత్ర. కానీ కోల్కతా ఆ ఇద్దరినీ వేలానికి ముందు వదిలేసింది. ఆటగాళ్లను అట్టిపెట్టుకునే విషయంలో కోల్కతాకు నిలకడ లేదు. శ్రేయస్, సాల్ట్లను వదులుకోవాలన్న కేకేఆర్ నిర్ణయం తప్పు. రహానె రూపంలో అనుభవజ్ఞుడైన కెప్టెన్ కేకేఆర్కు ఉన్నా.. కెప్టెన్గా అతడు ఇంకా టైటిల్ గెలవలేదు. శ్రేయస్ నాయకత్వపటిమ అద్భుతం’ అని అనిల్ కుంబ్లే అన్నాడు.
ఇవి కూడా చదవండి:
పాక్ ఆటగాళ్లకు రూ.50లక్షల జరిమానా.. ఆ వార్తలను ఖండించిన పీసీబీ
పాకిస్థాన్ ప్లేయర్ ప్రపంచ రికార్డ్..