Share News

పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించి సెమీ ఫైనల్‌కు చేరిన భారత్‌

ABN , Publish Date - Sep 10 , 2026 | 02:33 PM

జూనియర్‌ మహిళా ఆసియా కప్‌ హాకీ 2026 టోర్నీలో భారత సంచలన విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ ను 19-0 తేడాతో చిత్తుగా ఓడించింది.

పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించి సెమీ ఫైనల్‌కు చేరిన భారత్‌
India Thrash Pakistan

స్పోర్ట్స్ డెస్క్: జూనియర్‌ మహిళా ఆసియా కప్‌ హాకీ 2026 టోర్నీలో భారత జట్టు సంచలన విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్‌ను 19-0 తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా ఆసియా కప్2026లో సెమీస్‌లోకి దూసుకెళ్లింది. చైనాలోని మోకీ వేదికగా గురువారం క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌- పాక్‌ జట్లు తలపడ్డాయి.


ఆట ప్రారంభమైన 7వ నిమిషంలోనే పూజా సాహూ గోల్‌ కొట్టడంతో భారత్‌ ఖాతా తెరిచింది. ఆ తర్వాత రోషిణి ఐంద్‌, తనుశ్రీ దినేశ్‌ కదూ, సుఖ్‌వీర్‌ కౌర్‌, సనికా చంద్రకాంత్‌ మనే వరుస గోల్స్‌ సాధించారు. భారత్ ప్లేయర్లు దూకుడుగా ఆడటంతో ఆది నుంచి పాకిస్థాన్‌పై ఆధిపత్యం కొనసాగించింది. ఇక 23వ నిమిషంలో మనే మరో గోల్‌ కొట్టింది. అలానే తనూజ, పూజా మాలిక్‌, పూర్ణిమా యాదవ్‌ కూడా గోల్స్‌ సాధించారు. ఫలితంగా తొలి అర్ధ భాగం ముగిసే సరికి భారత్‌ 10-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధ భాగంలోనూ భారత మహిళా జట్టు విజృంభించింది.


మాలిక్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌తో మెరవగా.. సుప్రియా రెండుసార్లు గోల్‌ కొట్టింది. క్రిష్ణా శర్మ, బినిమా ధన్‌, రోషిణి కూడా చక్కటి ఆటతీరును కనబరుస్తూ పాక్‌ను మరింత కష్టాల్లోకి నెట్టారు. చివరి నిమిషంలో రోషిణి మరో గోల్‌ కొట్టడంతో పాక్‌పై 19-0 గోల్స్‌ తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తద్వారా భారత మహిళా హాకీ జూనియర్‌ జట్టు ఆసియా కప్‌ సెమీ ఫైనల్లోకి దూసుకువెళ్లింది. సౌత్‌ కొరియా- మలేషియా మధ్య మ్యాచ్‌ విజేతతో సెమీస్‌లో భారత్‌ తలపడుతుంది. ఇక గ్రూప్‌ దశలో భారత్‌ ఇప్పటికే జపాన్‌, మలేషియా, సౌత్‌ కొరియాలను ఓడించి టాపర్‌గా నిలిచింది.


ఇవి కూడా చదవండి:

ఆస్తి కోసం కొడుకు చేసిన కుట్రలకు సుప్రీంకోర్టు చెక్.. తల్లి కాళ్లు పట్టుకోమని ఆదేశం..

ఏఐ ఫేక్ వీడియోలతో మోసాలు.. ప్రజలకు ప్రియాంక గాంధీ ఆఫీస్ హెచ్చరిక..

Updated Date - Sep 10 , 2026 | 03:00 PM