Share News

భారత్-జపాన్ స్పెషల్ టీ20 మ్యాచ్.. యూట్యూబ్‌లో ప్రసారం?

ABN , Publish Date - Sep 07 , 2026 | 04:05 PM

భారత క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా టీమిండియా జపాన్‌తో టీ20 మ్యాచ్ ఆడనుంది. అయితే ఆసియా క్రీడలు 2026కు రెండు రోజుల ముందే ఈ మ్యాచ్ ఉండటంతో ప్రసార హక్కుల విషయంలో గందరగోళం నెలకొంది.

భారత్-జపాన్ స్పెషల్ టీ20 మ్యాచ్.. యూట్యూబ్‌లో ప్రసారం?
India vs Japan

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా టీమిండియా జపాన్‌తో టీ20 మ్యాచ్ ఆడనుంది. ఇరు దేశాల దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవ సంబరాల ప్రారంభ సూచికగా ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ నిర్వహించనున్నారు. శానో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా సెప్టెంబర్ 22న ఈ చారిత్రక మ్యాచ్ జరగనుంది. అయితే ఆసియా క్రీడలు 2026కు రెండు రోజుల ముందే ఈ మ్యాచ్ ఉండటంతో ప్రసార హక్కుల విషయంలో గందరగోళం నెలకొంది.


మ్యాచ్ ప్రసార హక్కుల కోసం ఐటీడబ్ల్యూ యూనివర్స్‌తో జపాన్ క్రికెట్ అసోసియేషన్(జేసీఏ) చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆసియా గేమ్స్‌కు కేవలం రెండు రోజుల ముందు ఈ మ్యాచ్ జరగనుండటంతో ప్రసార సంస్థలకు లాజిస్టిక్స్ సమస్యగా మారినట్లు తెలుస్తోంది. టీవీ ప్రసార ఒప్పందం కూడా ఇంకా ఖరారు కాలేదు. దీంతో మ్యాచ్‌ను యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసే అవకాశాలున్నట్లు సమాచారం. భారత్‌లో మ్యాచ్‌ ప్రసార వ్యవహారాల్లో ఫ్యాన్‌కోడ్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. జపాన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌తో గతంలోనూ ఫ్యాన్‌కోడ్‌ కలిసి పనిచేసింది. మరోవైపు ఐటీడబ్ల్యూ యూనివర్స్‌ స్టార్‌, సోనీ, జీ సంస్థలతో ప్రసార భాగస్వామ్యం కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.


ఇదిలా ఉంటే, ఆసియా గేమ్స్‌లో మహిళల క్రికెట్ ఫైనల్ మ్యాచ్ కూడా అదే రోజు ఉంది. ఇందులో టీమిండియానే ‘గోల్డ్ మెడల్’ ఫేవరేెట్‌గా భావిస్తున్నారు. ఆ మ్యాచ్ ముగిసిన రెండు గంటల్లోనే భారత్-జపాన్ పోరు జరగనుంది. దీంతో ఒకే రోజు రెండు మ్యాచ్‌లు ప్రసారం చేయడం జపాన్ బ్రాడ్‌కాస్టర్లకు తలనొప్పిగా మారింది. జపాన్‌తో మ్యాచ్‌కు రెండు రోజుల ముందు టీమిండియా శానోలో ప్రాక్టీస్‌ సెషన్‌ కూడా నిర్వహించనుండటం గమనార్హం.


ఇవి కూడా చదవండి:

భారత్‌పై సాధించిన ఆ విజయమే మా పతనానికి కారణం: పాక్ మాజీ కెప్టెన్

దులీప్ ట్రోఫీ ఫైనల్: విధ్వంసం.. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ

Updated Date - Sep 07 , 2026 | 04:05 PM