Tamim Iqbal: ఐసీసీ నిధులే బంగ్లా క్రికెట్కు ఆధారం.. మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 09 , 2026 | 01:03 PM
బంగ్లా-భారత్ క్రికెట్ మధ్య జరుగుతున్న వివాదాల నేపథ్యంలో ఆ దేశ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దేశ క్రికెట్ భవిష్యత్, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకోవాలని బీసీబీని హెచ్చరించాడు. ఐసీసీ నుంచే అధిక శాతం నిధులు వస్తాయని గుర్తు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఐపీఎల్ నుంచి ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్ను బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్ జట్టు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో బంగ్లా క్రికెట్ బోర్డు కూడా రానున్న టీ20 ప్రపంచ కప్లో భారత్లో జరిగే బంగ్లా మ్యాచుల వేదికలు మార్చాంటూ ఐసీసీకి లేఖ రాసింది. ఈ పరిణామాలు భారత్-బంగ్లా క్రికెట్ బోర్డులో వివాదాలకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో బంగ్లా క్రికెట్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్(Tamim Iqbal) సంచలన వ్యాఖ్యలు చేశాడు. దేశ క్రికెట్ భవిష్యత్, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకోవాలని బీసీబీని హెచ్చరించాడు.
‘నేను ప్రస్తుతం బీసీబీలో లేను. ఇతరుల్లాగే మీడియా ద్వారానే ఈ విషయాలు తెలుసుకుంటున్నాను. కానీ ఈ వ్యవహారాలను చూసేవారికి మరింత సమాచారం తెలిసి ఉంటుంది. అందుకే తొందరపడి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం.. బంగ్లాదేశ్ క్రికెట్ భవిష్యత్ అన్నింటి కన్నా ముఖ్యం. చర్చల ద్వారా పరిష్కారం దొరికితే అంతకన్నా మంచిదేమీ ఉండదు. ఇలాంటి సున్నితమైన అంశాల్లో ముందుగా బోర్డు లోపలే చర్చ జరగాలి. బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తే, అవి సరైనవైనా తప్పైనా, వెనక్కి తగ్గడం కష్టమవుతుంది. మన ఆర్థిక వనరుల్లో 90 నుంచి 95 శాతం ఐసీసీ(ICC) నుంచే వస్తాయి. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా దేశ క్రికెట్కు మేలు చేసేలా ఉండాలి” అని తమీమ్ స్పష్టం చేశాడు.
ఇవి కూడా చదవండి:
చరిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్
టెస్టులకు 15 రోజుల ప్రిపరేషన్ విండో.. గిల్ నిర్ణయంపై మాజీ క్రికెటర్ల ప్రశంసలు!