ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్య కోసం ఏడు ఫ్రాంచైజీలు పోటీ!
ABN , Publish Date - Jul 01 , 2026 | 04:44 PM
ట్రేడ్ డీల్లో భాగంగా హార్దిక్ పాండ్యను దక్కించుకునేందుకు ఏకంగా ఏడు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు మినహా అన్ని ఫ్రాంచైజీలు హార్దిక్ను జట్టులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య జట్టును వీడనున్నట్లు కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్లో ఎంఐ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అతడిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆ ఒత్తిడిని తట్టుకోలేకే హార్దిక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ట్రేడ్ డీల్లో భాగంగా అతడిని దక్కించుకునేందుకు ఏకంగా ఏడు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు మినహా అన్ని ఫ్రాంచైజీలు హార్దిక్ను జట్టులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ ముందంజలో ఉండగా, కోల్కతా నైట్ రైడర్స్ గట్టి పోటీ ఇస్తొందని తెలుస్తోంది. ఈ రేసులో రాజస్థాన్ రాయల్స్ కూడా రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
హార్దిక్ పాండ్య 2015లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసి.. 2021 వరకు ఆ జట్టుకే ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం కొత్తగా లీగ్లోకి వచ్చిన గుజరాత్ టైటాన్స్ జట్టులోకి తీసుకుని అతడిని కెప్టెన్గా నియమించింది. కెప్టెన్గా తొలి సీజన్లో జీటీకి ట్రోఫీని అందించాడు. రెండు సీజన్ల తర్వాత మళ్లీ ముంబై ఇండియన్స్కు తిరిగొచ్చి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. అయితే అతడి నాయకత్వంలో ముంబై మూడు సీజన్లలో వరుసగా 10వ, మూడు, తొమ్మిదో స్థానాలతో నిరాశపరిచింది.
బెంగళూరుకు మకాం మార్చిన హార్దిక్
కండరాల గాయం కారణంగా హార్దిక్ పాండ్య ఇంగ్లండ్ పర్యటనకు దూరమైన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో తన కెరీర్లో హార్దిక్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE)నే తన శాశ్వత శిక్షణ కేంద్రంగా మార్చుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. సాధారణంగా భారత జట్టు ఆటగాళ్లు గాయాల చికిత్స, ఫిట్నెస్ పరీక్షలు లేదా జాతీయ శిబిరాల కోసం మాత్రమే సీఓఈని వినియోగిస్తారు. కానీ హార్దిక్ మాత్రం బెంగళూరులో సీఓఈ సమీపంలో నివాసం అద్దెకు తీసుకుని, జాతీయ జట్టు, రాష్ట్ర జట్టు లేదా ఐపీఎల్ బాధ్యతలు లేని సమయంలో అక్కడే శిక్షణ పొందనున్నట్లు తెలుస్తోంది. ముంబైలోని లోయర్ పరేల్ నివాసం నుంచి ప్రతిరోజూ శిక్షణ కేంద్రానికి ప్రయాణించడం ఇబ్బందిగా మారడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
ఇవి కూడా చదవండి:
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానంలో ఇషాన్ కిషన్
ఫిఫా ప్రపంచ కప్ సంబరాల్లో విషాదం.. ఇద్దరి మృతి