క్రికెట్కు రాజకీయాలను దూరంగా ఉంచాలి: పాక్ మాజీ కెప్టెన్
ABN , Publish Date - Feb 10 , 2026 | 05:34 PM
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్తో మ్యాచ్ ఆడే విషయంలో పాక్ యూ టర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన పరిణామాల దృష్ట్యా ఈ ప్రపంచ కప్లో భారత్-పాక్ తలపడితే చూడాలని ఎంతో మంది ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ అంశంపై పాక్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్తో మ్యాచ్ ఆడే విషయంలో పాక్ యూ టర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్కు మద్దతుగా గ్రూప్ స్టేజిలో భారత్తో మ్యాచ్ ఆడబోమని ప్రకటించిన పాక్.. ఐసీసీ జోక్యంతో వెనక్కి తగ్గింది. సాధారణంగానే ఇండియా-పాక్ మ్యాచ్ అంటే అభిమానులకు ఆసక్తి ఎక్కువ. అందులోనూ ఇటీవల జరిగిన పరిణామాల దృష్ట్యా ఈ ప్రపంచ కప్లో ఇరు జట్లు తలపడితే చూడాలని ఎంతో మంది ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ అంశంపై పాక్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్(Mohammad Hafeez) స్పందించాడు.
‘భారత్-పాకిస్థాన్(India vs Pakistan) మ్యాచ్లకు నేనెప్పుడూ అనుకూలంగానే ఉంటా. ఎందుకంటే ఈ మ్యాచ్ మొత్తం ప్రపంచానికి స్ఫూర్తినిస్తుంది. టీ20 ప్రపంచ కప్లో ఇరుజట్ల మధ్య పోరు సజావుగా సాగుతుందని ఆశిస్తున్నా. ఇకపై తరచూ భారత్-పాక్ మ్యాచ్లు జరగాలని కోరుకుంటున్నా. క్రికెట్కు రాజకీయాలను దూరంగా ఉంచాలి. క్రికెట్ అభివృద్ధి, వ్యాప్తికి రెండు దేశాలు పూర్తిగా తమవంతు పాత్ర పోషించాలి. రాజకీయాల కారణంగా క్రికెట్ను ఎప్పటికీ ఆపకూడదు. ఫిబ్రవరి 15న జరిగే భారత్-పాక్ మ్యాచ్ పూర్తి క్రీడాస్ఫూర్తితో జరగాలి. మనకు ఆసియా కప్ లాంటి మ్యాచ్లు అక్కర్లేదు. ఒకవేళ అలానే ఆడితే ఈ మ్యాచ్ను నేను అసలు చూడకపోవడమే మంచిది’ అని హఫీజ్ పేర్కొన్నాడు.
గతేడాది ఆసియా కప్లో భాగంగా.. పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ పాక్ ఆటగాళ్లతో భారత ప్లేయర్లు కరచాలనం చేయలేదు. ఫైనల్లో విజయం సాధించిన టీమిండియా.. పీసీబీ చీఫ్ నఖ్వీ చేతుల మీదుగా ఆసియా కప్ ట్రోఫీని అందుకోవడానికి నిరాకరించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
భారత్తో మ్యాచ్.. అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు: పాక్ ప్రధానితో శ్రీలంక అధ్యక్షుడు
టీ20 ప్రపంచ కప్ 2026: సభ్య దేశాలను భయపెడుతున్న అసోసియేట్ జట్లు