Share News

టీమిండియా కీలక నిర్ణయం.. దులీప్ ట్రోఫీకి ఆ ఆటగాళ్లకు నో పర్మిషన్!

ABN , Publish Date - Aug 23 , 2026 | 08:02 AM

శ్రీలంకతో జరగనున్న రెండో టెస్టుకు ముందు టీమిండియా మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత జట్టు రిజర్వ్ ఆటగాళ్ల దేశవాలీ టోర్నీ అయిన దులీప్ ట్రోఫీకి ఆడేందుకు పర్మిషన్ ఇవ్వలేదు.

టీమిండియా కీలక నిర్ణయం.. దులీప్ ట్రోఫీకి ఆ ఆటగాళ్లకు నో పర్మిషన్!
India vs Sri Lanka 2nd Test

స్పోర్ట్స్ డెస్క్: శ్రీలంక, భారత్(IND vs SL) మధ్య ఇవాళ(ఆదివారం) రెండో టెస్టు ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు మేనేజ్‌మెంట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. గాలేలో జరిగిన తొలి టెస్టులో 165 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన శుభ్‌మన్ గిల్ సేన, ఈ ఆఖరి టెస్టును కూడా గెలుచుకుని క్లీన్‌స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది. అయితే ఇదే సమయంలో దేశవాళీ రెడ్-బాల్ టోర్నమెంట్‌ దులీప్ ట్రోఫీ కూడా ప్రారంభమవుతుంది.


ఈ టెస్టు జట్టులో రిజర్వ్‌గా ఉన్న ఆటగాళ్లను దేశవాళీ టోర్నీ కోసం విడుదల చేయడానికి టీమిండియా మేనేజ్‌మెంట్ నిరాకరించింది. ఒకవేళ మ్యాచ్ సమయంలో ఏవైనా గాయాలు లేదా 'కన్‌కషన్ సబ్‌స్టిట్యూట్' (Cranial concussion substitute) అవసరమైతే జట్టులో ప్లేయర్లు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. తొలి టెస్టులో తుది జట్టులో చోటు దక్కించుకోని గుర్నూర్ బ్రార్, ఆకీబ్ నబీ వంటి పేసర్లు రెండో టెస్టులోనూ జట్టుతోనే ఉండనున్నారు.


తొలి టెస్టులో మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ పేస్ బాధ్యతలు పంచుకోగా, కొలంబో టెస్టులోనూ ఇదే కాంబినేషన్‌ను కొనసాగించే అవకాశాలున్నాయి. దీనితో ఈ యువ పేసర్లు మరోసారి బెంచ్‌కే పరిమితమైనప్పటికీ, నార్త్ జోన్ తరఫున దులీప్ ట్రోఫీలో ఆడేందుకు మాత్రం జట్టు వీడేందుకు అనుమతి లభించలేదు. మరోవైపు దులీప్ ట్రోఫీ ఈస్ట్ జోన్ తరఫున యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆడనున్నాడు. అంతర్జాతీయ వేదికలపై అరుదైన రికార్డులు సృష్టించిన ఈ కుర్రాడు, తన ఫస్ట్-క్లాస్ గణాంకాలను మెరుగుపరుచుకోవడానికి ఈ టోర్నీని వేదికగా మలచుకోవాలని చూస్తున్నాడు.


ఇవి కూడా చదవండి:

ఫుట్‌బాల్‌లోకి ఉసేన్ బోల్ట్ రీఎంట్రీ?

డబ్ల్యూటీసీలో నంబర్ వన్ బౌలర్‌గా మిచెల్ స్టార్క్

Updated Date - Aug 23 , 2026 | 08:45 AM