డబ్ల్యూసీ 2026 వేళ.. పాకిస్థాన్కు ఘోర అవమానం..
ABN , Publish Date - Jan 31 , 2026 | 02:57 PM
గత కొంతకాలంగా మన పొరుగు దేశం పాకిస్థాన్ కూడా వివిధ దేశాలతో ఆల్ఫార్మాట్ సిరీస్లు ఆడుతోంది. తాజాగా ఆస్ట్రేలియా.. పాకిస్థాన్ పర్యటనలో ఉంది. ఈ క్రమంలో పాక్కు ఘోర అవమానం జరిగింది..
స్పోర్ట్స్ డెస్క్: మరికొద్ది రోజుల్లో టీ20 ప్రపంచ కప్-2026 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మెగా టోర్నీలో పాల్గొనే అన్ని జట్లు సన్నాహక మ్యాచులతో బిజీగా ఉన్నాయి. అలానే గత కొంతకాలంగా మన పొరుగు దేశం పాకిస్థాన్ కూడా వివిధ దేశాలతో ఆల్ఫార్మాట్ సిరీస్లు ఆడుతోంది. తాజాగా ఆస్ట్రేలియా.. పాకిస్థాన్ పర్యటనలో ఉంది. ఈ క్రమంలో పాక్కు ఘోర అవమానం జరిగింది. మరి.. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం...
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి సన్నాహకంగా ఆతిథ్య జట్టు పాకిస్థాన్(Pakistan) జట్టుతో ఆస్ట్రేలియా మూడు టీ20 మ్యాచుల సిరీస్ ఆడుతోంది. లాహోర్లో తొలి టీ20లో పాక్ గెలిచింది. అయితే, ఈ మ్యాచ్కు ఆసీస్ రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ దూరంగా ఉన్నాడు. అతడి స్థానంలో ట్రావిస్ హెడ్ జట్టును ముందుకు నడిపించాడు. మార్ష్తో పాటూ మార్కస్ స్టొయినిస్, జోష్ ఇంగ్లిస్, బెన్ డ్వార్షుయిస్ తదితర స్టార్ ప్లేయర్లు కూడా ఈ మ్యాచ్కు దూరంగా ఉన్నారు. అలానే ఈ సిరీస్కు ముందే ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్వుడ్, టిమ్ డేవిడ్, గ్లెన్ మాక్స్వెల్, నాథన్ ఎల్లిస్ వంటి కీలక ఆటగాళ్లకు క్రికెట్ ఆస్ట్రేలియా (CA) విశ్రాంతినిచ్చింది. వాళ్లంతా ఇప్పుడిప్పుడే గాయాల నుంచి కోలుకున్నందున సీఏ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.
ఇదే సమయంలో పాక్తో తొలి టీ20 సందర్భంగా ఆస్ట్రేలియా ఏకంగా ముగ్గురు ఆటగాళ్లను అరంగేట్రం చేయించింది. మహ్లి బియర్డ్మాన్, జాక్ ఎడ్వర్డ్స్లకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తొలిసారి క్యాపులు అందించింది. అలానే మ్యాట్ రెన్షాకు తొలి టీ20 అవకాశం ఇచ్చింది. అయితే, అంతకుముందు మిగిలిన SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల జట్లు కూడా తమ కీలక ఆటగాళ్లను కాకుండా.. మెజారిటీ భాగం ద్వితీయ శ్రేణి జట్లతోనే పాక్లో పర్యటించాయి.
ఘోర అవమానం ఏంటంటే..
ఇలా టాప్ దేశాలు తమ ద్వితీయ శ్రేణి జట్టును బరిలో దింపడంతో పాకిస్థాన్ క్రికెట్ స్థాయి దిగజారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. పాక్ను తేలికగా తీసుకుంటున్నందునే ఈ మేటి జట్లు తమ కీలక ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగుతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పాక్ క్రికెట్ విశ్లేషకుడైన ఒమైర్ అలవి ఇవే మాటలు అన్నాడు. ఆస్ట్రేలియా కొంతమంది ప్రధాన ఆటగాళ్లు లేకుండానే పాకిస్థాన్ వచ్చిందని, అదే విధంగా.. తొలి టీ20లో వారి అత్యుత్తమ ప్లేయర్లను ఆడించనేలేదని అన్నాడు. ఇది పాకిస్థాన్ క్రికెట్ అభిమానులకు ఘోర అవమానమని ఒమైర్ విచారం వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా దేశాలు తమ వీకెండ్ జట్లతో పాకిస్థాన్కు వచ్చాయని, ఏదో సిరీస్ ఆడాలి కాబట్టి మొక్కుబడిగా ఈ పని చేస్తున్నాయని అనిపిస్తోందని పాక్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ అన్నాడు.
ఇవి కూడా చదవండి:
ఆ విషయంలో సూర్యకు క్రెడిట్ దక్కట్లేదు: ఇర్ఫాన్ పఠాన్
దాన్ని అద్భుతమైన ప్రదర్శన అనలేం.. పాక్ పీఎం ట్వీట్పై ఆకాశ్ చోప్రా రియాక్షన్