సౌతాఫ్రికాతో మ్యాచ్కు ముందు సూర్యకుమార్కు గుడ్న్యూస్
ABN , Publish Date - Feb 22 , 2026 | 12:20 PM
టీ20 ప్రపంచ కప్ 2026లో సూపర్-8లో భాగంగా ఇవాళ(ఆదివారం) భారత్, సౌతాఫ్రికా తలపడనున్నాయి. దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్కు ముందు సూర్యకుమార్ యాదవ్కు అదిరిపోయే న్యూస్ వచ్చింది.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2026)లో సూపర్-8లో భాగంగా ఇవాళ(ఆదివారం) భారత్, సౌతాఫ్రికా తలపడనున్నాయి. 2024 ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని సఫారీ జట్టు కసితో ఉంది. అలానే గత సీన్ను పునరావృతం చేయాలనే పట్టుదలతో సూర్యకుమార్ సేన ఉంది. సౌతాఫ్రికా మ్యాచ్కు ముందు సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav)కు అదిరిపోయే న్యూస్ అందింది.
2026 జనవరి నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు సూర్య నామినేట్ అయ్యాడు. పురుషుల విభాగంలో సూర్యతో పాటు న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్, ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్ కూడా నామినేట్ అయ్యారు. మహిళల విభాగంలో ఐర్లాండ్కు చెందిన గాబీ లూయిస్, బంగ్లాదేశ్ ప్లేయర్ శోభన మోస్టరీ(Shobhana Mostary), అమెరికాకు చెందిన టారా నోర్రిస్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు. గత నెలలో వీరంతా తమ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శనలు చేయడంతో ఐసీసీ వీరిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు నామినేట్ చేసింది.
సూర్యకుమార్ యాదవ్
ఈ ఏడాది జనవరి నెలలో న్యూజిలాండ్(New Zealand)తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో సూర్యకుమార్ మునుపటి ఫామ్ను అందుకున్నాడు. ఈ సిరీస్కు ముందు స్కై వరుసగా 25 ఇన్నింగ్స్ల్లో ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు. అలాంటిది కివీస్ సిరీస్లో ఏకంగా మూడు హాఫ్ సెంచరీలు సాధించి తన ఫామ్ను చాటుకున్నాడు. 197 స్ట్రైక్రేట్తో 242 పరుగులు చేసి టీమిండియాకు 4-1 తేడాతో సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనల కారణంగానే సూర్య ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ప్రస్తుత ప్రపంచ కప్ 2026 టోర్నీలోనూ అతడు మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇవాళ సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్లో స్కై ఆట ఎలా ఉంటుందనే దానిపై క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇవీ చదవండి:
'ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా భారత్ను సందర్శించాల్సిందే'
ట్రంప్ సంచలన నిర్ణయం.. ప్రపంచం ముందుకు ఏలియన్స్ సీక్రెట్ ఫైల్స్