ఐసీసీ ర్యాంకింగ్స్లో ‘తెలుగుతేజం’ శ్రీ చరణి సంచలనం
ABN , Publish Date - Jul 07 , 2026 | 08:21 PM
ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్లో భారత బౌలర్ శ్రీ చరణి సంచలనం సృష్టించింది. బౌలింగ్ విభాగంలో శ్రీ చరణి నంబర్వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది.
స్పోర్ట్స్ డెస్క్: మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్లో భారత యువ స్పిన్నర్, తెలుగుతేజం శ్రీ చరణి సరికొత్త రికార్డు సృష్టించింది. ఐసీసీ ఇవాళ(మంగళవారం) విడుదల చేసిన తాజా టీ20 ర్యాంకింగ్స్లో ఆమె ప్రపంచ నంబర్ వన్ బౌలర్గా తన అగ్రస్థానాన్ని పదిలపరుచుకుంది. 759 పాయింట్లతో ర్యాంకింగ్స్లో నంబర్వన్ స్థానంలో కొనసాగుతోంది. ఇటీవలే ముగిసిన ప్రపంచకప్లో కేవలం ఐదు మ్యాచ్ల్లోనే 14 వికెట్లు పడగొట్టి టోర్నమెంట్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా శ్రీ చరణి నిలిచింది.
అంతేకాదు ఐసీసీ ప్రకటించిన 'టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్లోనూ చోటు దక్కించుకున్న ఏకైక భారత క్రికెటర్గా శ్రీ చరణి రికార్డు సృష్టించింది. బౌలింగ్ విభాగంలో శ్రీ చరణి తర్వాత సోఫి ఎకెల్స్టోన్ (ఇంగ్లండ్) 723 పాయింట్లు, చార్లీడీన్ (ఇంగ్లండ్) 722 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. భారత ఆల్రౌండర్ దీప్తి శర్మ 8వ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు, బ్యాటింగ్ విభాగంలో ఆస్ట్రేలియా ఓపెనర్ బెత్ మూనీ మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో 64 పరుగులతో రాణించి ఆసీస్ను విజేతగా నిలిపిన మూనీ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డునూ గెలుచుకుంది. ఆమె తన సహచర క్రీడాకారిణి జార్జియా వోల్ను వెనక్కి నెట్టి ఐదోసారి అగ్రపీఠాన్ని అధిరోహించింది.
బ్యాటింగంలో టాప్-10లో ముగ్గురు భారతీయ బ్యాటర్లు చోటు దక్కించుకున్నారు. భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (746 పాయింట్లు) ఐదో స్థానంలో కొనసాగుతుండగా, షెఫాలీ వర్మ (717 పాయింట్లు) ఆరో స్థానంలో, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (677 పాయిట్లు) పదో స్థానంలో కొనసాగుతోంది. ఆల్రౌండర్ల విభాగంలో వెస్టిండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ నంబర్వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. అమేలి కెర్ (న్యూజిలాండ్), చమేరి ఆటపట్టు (శ్రీలంక) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. భారత్ నుంచి దీప్తి శర్మ 5వ స్థానంలో కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి:
45వ పడిలోకి ‘తలా’.. ప్రపంచకప్ వేదికగా ఫిఫా వినూత్న శుభాకాంక్షలు!
తప్పుడు వార్తలపై సూర్యకుమార్ యాదవ్ ఫైర్!