అతడి వల్లే మ్యాచ్ గెలిచాం: ప్యాట్ కమిన్స్
ABN , Publish Date - Apr 30 , 2026 | 09:57 AM
వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘన విజయాన్ని అందుకుంది. మ్యాచ్ అనంతరం ఈ విజయంపై ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ పాట్ కమిన్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. నిన్న(బుధవారం) వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 244 పరుగుల లక్ష్యాన్ని కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో చేధించింది. హైదరాబాద్కు ఐపీఎల్లో ఇది వందో విజయం కావడం గమనార్హం. మ్యాచ్ అనంతరం ఈ విజయంపై ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. ఎంతటి భారీ టార్గెట్నైనా ఛేదించే సత్తా తమ బ్యాటర్లకు ఉందని తెలిపాడు.
'మా ఓపెనర్ల బ్యాటింగ్ చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది. నేను వారికి బౌలింగ్ చేయనందుకు సంతోషంగా ఉంది. ఐదేళ్ల క్రితం 200 పరుగులు ఛేదించడం కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు 240 పరుగులు కూడా సాధ్యమేనని ప్లేయర్లు నిరూపిస్తున్నారు. ఇప్పుడు ఓవర్కు 12 పరుగులు చేయాల్సి ఉన్నా, బ్యాటర్లు దానిని సులువుగా ఛేదిస్తున్నారు. కానీ ఇలాంటి మ్యాచ్ల్లో ఒక అద్భుతమైన 'యార్కర్' మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తుంది' అని కమిన్స్ వెల్లడించాడు.
'క్లాసెన్ మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. ప్రతీ మ్యాచ్లోనూ రాణిస్తున్నా ఇలాంటి ఆటగాడు జట్టులో ఉండటం మా అదృష్టం. మరోవైపు సలీల్కు ఈ సీజన్లో ఎక్కువ అవకాశాలు రాలేదు. కానీ ఛాన్స్ దొరికిన ప్రతీ మ్యాచ్లోనూ సత్తాచాటుతున్నాడు. అలానే జట్టు విజయాల్లో ఇషాన్ మలింగ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మా జట్టులో ఇషాన్ మలింగ వంటి అత్యుత్తమ బౌలర్లు ఉన్నారు. కోచింగ్ స్టాఫ్ యువ ఆటగాళ్లలో భయం లేని ధోరణిని పెంపొందించడం జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్' అని కమిన్స్ తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
నల్ల బ్యాండ్లు ధరించిన ముంబై ఆటగాళ్లు.. ఎందుకంటే?
ఆ రెండు తప్పిదాలే మా ఓటమికి కారణం: హార్దిక్ పాండ్య