గొప్ప కెప్టెన్ అవుతాడు.. శ్రేయస్కు మద్దతుగా నిలిచిన సోదరి శ్రేష్ఠ
ABN , Publish Date - Jul 09 , 2026 | 03:35 PM
భారత టీ20 జట్టు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు వరుస పరాజయాలు ఎదురవుతుండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రేయస్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ తన సోదరుడికి మద్దతుగా నిలిచింది.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు వరుసగా పరాజయాలు ఎదురువుతున్నాయి. ఐర్లాండ్ టూర్తో తొలిసారి జాతీయ జట్టు పగ్గాలు అందుకున్న శ్రేయస్ వరుస ఓటములు పలకరిస్తుండటంతో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో అతడికి సోదరి శ్రేష్ఠ అయ్యర్ మద్దతుగా నిలిచింది. అంతేకాక భారత క్రికెట్ లెజెండ్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్ల కెప్టెన్సీ ఓటములను ఉదాహరణగా చూపించి.. తన సోదరుడిని విమర్శించే వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న శ్రేష్ఠ అయ్యర్ పలు విషయాలను వెల్లడించారు. ' సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ..వీళ్లంత క్రికెట్ లెజెండ్స్. వీళ్లు కూడా తమ కెరీర్లో ఎన్నో మ్యాచ్లు ఓడిపోయారు. కానీ ప్రతిసారీ శ్రేయస్నే విమర్శించడం సరికాదు. అలా చేస్తే సమస్య అతడిలో కాకుండా విమర్శించే వారిలోనే ఉండొచ్చు' అని ఆమె వ్యాఖ్యానించింది. మరోవైపు నెటిజన్లు శ్రేయస్ను దిగ్గజాలతో పోల్చొద్దని చెప్పినప్పటికీ.. శ్రేష్ఠ మాత్రం తన సోదరుడిపై సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేసింది.
'శ్రేయస్ గొప్ప వ్యక్తిత్వం కలిగిన ఆటగాడు. అతడిలోచాలా ప్రతిభ ఉంది. సరైన సమయం వచ్చినప్పుడు అతడే భారత అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా గుర్తింపు పొందుతాడని నేను బలంగా నమ్ముతున్నాను' అని పేర్కొంది. మరోవైపు వరుస వైఫల్యాలు ఎదురైనా శ్రేయస్ అయ్యర్పై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో పాటు జట్టు మేనేజ్మెంట్ విశ్వాసం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్2028ను దృష్టిలో పెట్టుకుని యువ జట్టుతో కొత్త ప్రణాళికలు అమలు చేస్తున్న నేపథ్యంలో శ్రేయస్కు మరిన్ని అవకాశాలు లభించే అవకాశం ఉందని క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లోకి గిల్ సహచరుడు
రొనాల్డినోలా జైలుకు పంపుతా.. ఎంబాపెకు పరాగ్వే సెనేటర్ వార్నింగ్