ఐపీఎల్ 2026: చరిత్ర సృష్టించిన రవి బిష్ణోయ్
ABN , Publish Date - Apr 05 , 2026 | 04:03 PM
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. అలానే ఆ జట్టు స్టార్ బౌలర్ రవి బిష్ణోయ్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్(IPL) 2026లో రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. నిన్న (శనివారం) గుజరాత్ టైటాన్స్తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో చివరకు రాజస్థాన్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్లో ధ్రువ్ జురేల్, జైస్వాల్ మెరిస్తే.. ఆ తర్వాత బౌలింగ్లో రవి బిష్ణోయ్, తుషార్ దేశ్పాండే సూపర్ బౌలింగ్తో రాజస్థాన్(Rajasthan) సూపర్ విక్టరీని అందుకుంది. ఈ క్రమంలో రవి బిష్ణోయ్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
ఈ మ్యాచ్లో బిష్ణోయ్(Ravi Bishnoi) నాలుగు వికెట్లు తీసి.. రాజస్థాన్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అంతేకాక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. గుజరాత్ బ్యాటర్లు సాయి సుదర్శన్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియాలను పెవిలియన్ చేర్చాడు. అయితే ఫిలిప్స్ వికెట్ తీయడం ద్వారా రవి బిష్ణోయ్ టీ20 క్రికెట్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు.
భారత్ తరఫున ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా బిష్ణోయ్ నిలిచాడు. ఇతడు 25 ఏళ్ల 211 రోజులు వయస్సులో 171 మ్యాచ్ల్లో 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అలానే భారత్ తరఫున టీ20ల్లో 200 వికెట్లు తీసిన 19వ బౌలర్గా, 9వ స్పిన్ బౌలర్గా బిష్ణోయ్ రికార్డులకెక్కాడు. ఓవరాల్గా చూసుకుంటే టీ20 క్రికెట్లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా రషీద్ ఖాన్ (23 ఏళ్ల 119 రోజులు) పేరిట రికార్డు ఉంది.
ఇవి కూడా చదవండి:
టాస్ నెగ్గిన లఖ్నవూ.. బ్యాటింగ్ ఎవరిదంటే..
సెహ్వాగ్-గంభీర్లనే వెనక్కి నెట్టిన వైభవ్!