పాకిస్థాన్ క్రికెట్లో అలజడి.. సెలెక్షన్ కమిటీకి మిస్బా ఉల్ హక్ రాజీనామా!
ABN , Publish Date - Sep 01 , 2026 | 06:11 PM
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీసుకున్న సంచలన నిర్ణయాలు ఆ దేశ క్రికెట్లో తీవ్ర పరిణామాలకు దారితీశాయి. ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో జట్టు ప్రదర్శన పేలవంగా ఉండటంతో పీసీబీ భారీ మార్పులు చేపట్టింది.
స్పోర్ట్స్ డెస్క్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీసుకున్న సంచలన నిర్ణయాలు ఆ దేశ క్రికెట్లో తీవ్ర పరిణామాలకు దారితీశాయి. ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో జట్టు ప్రదర్శన పేలవంగా ఉండటంతో పీసీబీ టెస్టు జట్టు ఆటగాళ్లతో పాటు కోచింగ్ సిబ్బందిలోనూ భారీ మార్పులు చేపట్టింది. ఈ పరిణామాలతో మనస్తాపం చెందిన పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్బా-ఉల్-హక్ సెలెక్షన్ కమిటీ పదవికి రాజీనామా చేశాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ 194 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూడటంతో సిరీస్ను 2-0తో కోల్పోయింది. ఈ ఓటమే పీసీబీ భారీ ప్రక్షాళనకు కారణమైంది.
సెలెక్షన్ కమిటీ సభ్యుడిగా తప్పుకోవడంతో పాటు, లాహోర్లోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో తాను నిర్వహిస్తున్న బ్యాటింగ్ కన్సల్టెంట్ బాధ్యతలకూ మిస్బా స్వస్తి పలికాడు. అయితే అతడి రాజీనామాను పీసీబీ ఇంకా ఆమోదించలేదని సమచారం. జట్టు ప్రక్షాళన నేపథ్యంలో బోర్డు తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు, మిస్బాను సంప్రదించకుండా వ్యవహరించిన తీరుపై అతడు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పాక్ తరఫున అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్గా ఉన్న మిస్బా 2017లో రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఆ తర్వాత కాలంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించాడు. 2019లో అతడు ఏకకాలంలో హెడ్ కోచ్గా, చీఫ్ సెలెక్టర్గా ఎంపికయ్యాడు. అయితే బాధ్యతల ఒత్తిడి కారణంగా 2020 అక్టోబర్లో చీఫ్ సెలెక్టర్ పదవికి, 2021లో హెడ్ కోచ్ పదవికి వరుసగా రాజీనామా చేశాడు. అనంతరం 2023లో పీసీబీ తాత్కాలిక నిర్వహణ కమిటీ చీఫ్ జకా అష్రాఫ్ హయాంలో అతడు సలహాదారుడిగా మళ్లీ బోర్డులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో జట్టు వైఫల్యాలు, పీసీబీ తీసుకున్న హఠాత్తు నిర్ణయాలతో పాక్ క్రికెట్లో మరోసారి సంక్షోభం ఏర్పడింది. మరి మిస్బా రాజీనామాను పీసీబీ పెద్దలు ఏ విధంగా పరిష్కరిస్తారనేది వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి:
ముంబై ఇండియన్స్తోనే పాండ్య.. కానీ, కెప్టెన్గా కాదు!
ఆ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ను నమ్మోచ్చు: హర్షా భోగ్లే