Share News

టెస్ట్ క్రికెట్‌ కోసం ఐపీఎల్ తరహా ప్రణాళికను అందించిన లలిత్ మోదీ

ABN , Publish Date - Jun 04 , 2026 | 10:56 AM

టెస్టు క్రికెట్‌పై ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ పలు వ్యాఖ్యలు చేశాడు. అలానే టెస్టు క్రికెట్‌ను కాపాడేందుకు ఐపీఎల్ తరహాలో ఓ ప్రణాళికను అందించాడు.

టెస్ట్ క్రికెట్‌ కోసం ఐపీఎల్ తరహా ప్రణాళికను అందించిన లలిత్ మోదీ
Lalit Modi

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ఫార్మాట్ వచ్చిన తర్వాత క్రికెట్‌లో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. అనేక దేశవాళీ టీ20 లీగ్స్ పట్టుకొచ్చాయి. క్రికెట్ ప్రియులు సైతం ఈ ఫార్మాట్ మ్యాచులను చూసేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో వన్డే మ్యాచులకు కాస్త ప్రభావం తగ్గిందని క్రీడా నిపుణలు చెబుతున్నారు. ఇక టెస్టు క్రికెట్ అయితే ఆదరణ కోల్పోయి.. ప్రమాదకర స్థితిలో ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఈ క్రమంలో టెస్టు క్రికెట్‌ను బతికించేందుకు ఐపీఎల్ తరహాలో ఓ ప్రణాళికను ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ అందించాడు.


ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను తిరిగి ఆకర్షించడానికి వాణిజ్యపరమైన చర్యలు ప్రవేశపెట్టకపోతే, సాంప్రదాయ, ద్వైపాక్షిక రెడ్ బాల్ సిరీస్‌లు పూర్తిగా అంతరించిపోతాయని లలిత్ మోదీ హెచ్చరించాడు. లండన్‌లో ఓ మీడియాతో మాట్లాడుతూ.. ఫ్రాంచైజీ ఆధారిత నమూనాలు ఇకపై కేవలం ఒక ప్రత్యామ్నాయాలు మాత్రమే కాదని, టెస్ట్ క్రికెట్ వారసత్వాన్ని నిలబెట్టడానికి అవసరమైన జీవనాధారాలని తెలిపాడు.


క్రికెట్ నిర్వహాకులు ఐపీఎల్ తరహా టెస్ట్ మ్యాచ్‌లకు అనుమతి ఇవ్వాలని, వారు చేయవలసిన తదుపరి పని టెస్ట్ మ్యాచ్‌లను తిరిగి తీసుకురావడమేనని పేర్కొన్నాడు. వన్ డే (ODI) అంతం కావాలని, అలానే క్రికెట్ ప్రపంచంలో టెస్టులు కొనసాగడం చాలా ముఖ్యమని లలిత్ మోదీ నొక్కి చెప్పాడు. రెడ్ బాల్ క్రికెట్ ఆర్థికంగా టీ20 ఫార్మట్ లీగ్‌లతో పోటీపడలేదని లలిత్ మోడీ అంగీకరించాడు. అయితే టెస్టు క్రికెట్ నిలదొక్కుకోవడం అనేది ప్రభుత్వ బోర్డుల కంటే ఫ్రాంచైజీ కార్పొరేట్ మద్దతుపైనే ఆధారపడి ఉందని పేర్కొన్నాడు.


క్లబ్ క్రికెట్ చర్యలు తీసుకోకపోతే టెస్ట్ క్రికెట్ అంతరించిపోతుందని, ఇది నష్టాల వ్యాపారంగా మిగిలిపోతుందని అన్నాడు. ప్రతీదీ డబ్బు సంపాదించాలని తాను అనడం లేదు... ప్రతీదానిలో లాభం ఉండాల్సిన అవసరం లేదని, ఆట కోసం కూడా మనం ఏదైనా చేయాలని లలిత్ మోదీ వెల్లడించాడు. ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఐదు రోజుల టెస్టులను నాలుగు రోజుల, అలానే డే అండ్ నైట్ మ్యాచ్‌లుగా మార్చాలని లలిత్ మోదీ ప్రతిపాదించాడు. ఫ్రాంచైజీ లీగ్‌లు, ఐసీసీ ఈవెంట్ల వల్ల టెస్ట్ క్రికెట్ ఆదరణ కోల్పోతున్న తరుణంలో ఆయన ఈ హెచ్చరిక చేశాడు.


ఇవి కూడా చదవండి:

బోర్లా పడ్డ రోహిత్ శర్మ.. అభిమానుల్లో ఆందోళన

సూర్యకుమార్‌కు బిగ్ షాక్‌.. టీమిండియాకు కొత్త కెప్టెన్‌!

Updated Date - Jun 04 , 2026 | 11:04 AM