హీరో అవ్వాలని చూశాడు.. తిలక్ వర్మపై కృష్ణమాచారి సంచలన వ్యాఖ్యలు!
ABN , Publish Date - Jun 30 , 2026 | 07:31 PM
ఐర్లాండ్ పర్యటనలో రెండు టీ20ల సిరీస్ను టీమిండియా 0-2 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసిందే. రెండో టీ20లో భారత్ ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. దీంతో భారత జట్టుపై మాజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచకప్ 2026ను ముద్దాడిన కొన్ని నెలలకే పసికూన ఐర్లాండ్ చేతిలో భారత క్రికెట్ జట్టుకు ఊహించని పరాభవం ఎదురైంది. రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ను 0-2తో టీమిండియా కోల్పోయింది. రెండో టీ20లో 155 పరుగుల సాధారణ లక్ష్య ఛేదనలో భారత్ కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. దీంతో టీమిండియాపై మాజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలానే ఈ ఓటమిపై భారత మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్ వేదికగా తీవ్రంగా మండిపడ్డాడు. ముఖ్యంగా తిలక్ వర్మపై సంచలన కామెంట్స్ చేశాడు.
హీరో అవ్వాలని చూశాడు..
భారత బ్యాటర్ల నెమ్మదైన ఆటతీరే ఈ ఓటమికి కారణమని శ్రీకాంత్ విమర్శించారు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో తిలక్ వర్మ (46 బంతుల్లో 55), శివం దూబే (16 బంతుల్లో 20), అక్షర్ పటేల్ (18 బంతుల్లో 14) ఆడిన తీరుపై ఆయన నిప్పులు చెరిగాడు. 'మిడిల్ ఓవర్లలో భారత్ ఘోరంగా ఆడింది. వీరి స్ట్రైక్ రేట్లు చాలా పేలవంగా ఉన్నాయి. తిలక్ వర్మ, అక్షర్ పటేల్ కేవలం సింగిల్స్, డబుల్స్ తీస్తూ తమ వ్యక్తిగత స్కోర్ల కోసమే ఆడినట్లు అనిపించింది. ఇలాంటి చిన్న లక్ష్యాలను ఒక ఓవర్ మిగిలి ఉండగానే ముగించాలి కానీ, ఆఖరి బంతి వరకు తీసుకెళ్లకూడదు' అని శ్రీకాంత్ పేర్కొన్నాడు.
'తిలక్ వర్మ మ్యాచ్ను చివరి వరకు తీసుకెళ్లి తానేదో పెద్ద హీరో అయిపోవాలని చూశాడు. మ్యాచ్ గెలిపించి జెర్సీ విప్పి సంబరాలు చేసుకోవాలనుకున్నాడేమో!. ఈ స్వార్థపూరిత ధోరణి వల్లే భారత్ ఓడిపోయింది' అంటూ శ్రీకాంత్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కొత్త నాయకత్వంలో ప్రయాణం మొదలుపెట్టిన టీమిండియాకు ఈ ఓటమి పెద్ద గుణపాఠమని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
టీమిండియా నిష్క్రమించినా.. అగ్రస్థానంలోనే శ్రీ చరణి
బిడ్డ మరణం.. పుట్టెడు దుఃఖంలోనూ వరల్డ్ కప్లో గోల్