కడప స్టీల్ ప్లాంట్ పనులకు ముహూర్తం ఫిక్స్
ABN , Publish Date - Jun 30 , 2026 | 05:30 PM
కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ముహూర్తం ఖరారైంది. జులై 3న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు.
న్యూఢిల్లీ: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ముహూర్తం ఖరారైంది. జులై 3న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు నంద్యాల ఎంపీ శబరి తెలిపారు. కడప స్టీల్ ప్లాంట్ రాయలసీమ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్న ఆమె, మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపించే ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో కనీసం కాంపౌండ్ వాల్ కూడా నిర్మించలేదని విమర్శించారు.
2018 డిసెంబర్ 27న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కడప స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. రాయలసీమపై వెనుకబడిన ప్రాంతం అనే ముద్రను తొలగించి, 'రాయల్ సీమ'గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆమె చెప్పారు. హార్టికల్చర్, ఎలక్ట్రానిక్స్, పరిశ్రమల హబ్గా రాయలసీమను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు కొబ్బరికాయలు కొట్టి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కడప స్టీల్ ప్లాంట్ కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదని, వేలాది మంది యువతకు ఉపాధి, అనేక కుటుంబాలకు భవిష్యత్తుకు భరోసా కల్పించే ప్రాజెక్టు అని పేర్కొన్నారు.
విద్యుత్, నీటి సరఫరా, రహదారులు వంటి అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేసిన తర్వాతే నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు దాదాపు 800 కంపెనీలు పెట్టుబడులతో ముందుకొచ్చాయని పేర్కొంటూ, గత ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధికి ఏం చేసిందో సమాధానం చెప్పాలని ఎంపీ శబరి డిమాండ్ చేశారు.
Also Read:
వికాసిత్ భారత్ లక్ష్యంలో యువతదే కీలక పాత్ర: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
పారిశ్రామిక హబ్గా ఆంధ్రప్రదేశ్: మంత్రి టీజీ భరత్