భారత్తో టెస్ట్ సిరీస్.. శ్రీలంక క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం
ABN , Publish Date - Aug 07 , 2026 | 07:58 PM
భారత్తో టెస్టు సిరీస్కు ముందు అభిమానులకు శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) తీపి కబురు అందించింది. గాలే, కొలంబోలలో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్లను వీక్షించేందుకు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
స్పోర్ట్స్ డెస్క్: భారత్, శ్రీలంక మధ్య రెండు టెస్టు మ్యాచుల సిరీస్ జరగనుంది. ఆగస్టు 15న తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. అది క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. గాలే, కొలంబోలలో జరగనున్న ఈ రెండు టెస్టు మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆడియన్స్కు ఉచిత ప్రవేశం కల్పించింది. ఈ మేరకు శుక్రవారం శ్రీలంక క్రికెట్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. టెస్టు క్రికెట్ ఆదరణ పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ఎల్సీ వెల్లడించింది.
భారత్, శ్రీలంక సిరీస్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2025-27 సైకిల్లో భాగంగా జరగనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్కు అర్హత సాధించాలంటే ఇరు జట్లకు ఈ సిరీస్ చాలా కీలకం కానుంది. తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (GICS)లో జరగనుంది. అలానే రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరగనుంది.
ఇక ఈ మ్యాచులను చూసేందుకు భారీగా ప్రేక్షకులు వస్తారని శ్రీలంక క్రికెట్ బోర్డు భావిస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచులు జరిగే రెండు మైదానాలలోనూ నిర్దేశిత ప్రవేశ మార్గాలను ఏర్పాటు చేసింది. మ్యాచ్లకు హాజరయ్యే ప్రేక్షకులకు గాలేలో గేట్ నెం. 4 , కొలంబోలో గేట్లు 3, 4, 5, 7 ద్వారా ఉచిత ప్రవేశం కల్పించింది. దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను, యువ క్రికెటర్లను, కుటుంబాలను, క్రీడాభిమానులను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఎల్సి తెలిపింది.
ఇవి కూడా చదవండి:
పాకిస్థాన్ క్రికెటర్కు బిగ్ షాక్.. రెండేళ్లు నిషేధం
వైభవ్ను వైస్ కెప్టెన్గా నియమించకుండా ఉండాల్సింది: మాజీ క్రికెటర్ ప్రియాంక్