నా సెంచరీకి శ్రీలంక ప్లేయర్ కూడా కారణం: జురెల్
ABN , Publish Date - Aug 25 , 2026 | 08:06 AM
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాటర్ ధ్రువ్ జురెల్ అద్భుత శతకంతో మెరిశాడు. సెంచరీ సెలబ్రేషన్లో కండల ప్రదర్శన చేయడంపై ధ్రువ్ జురెల్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాటర్ ధ్రువ్ జురెల్ శతకం చేసిన సంగతి తెలిసిందే. 177 బంతుల్లో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక సెంచరీ మార్క్ అందుకున్న వెంటనే కండలు చూపిస్తూ సంబరం చేసుకున్నాడు. అయితే కండల ప్రదర్శన చేయడానికి గల కారణాన్ని మ్యాచ్ అనంతరం ధ్రువ్ జురెల్ వెల్లడించాడు. అంతేకాక తాను సెంచరీ చేయడానికి లంక ఆటగాడు నిరోషన్ డిక్వెల్లా కూడా ఒక కారణమని జురెల్ పేర్కొన్నాడు.
ప్రెస్ కాన్ఫరెన్స్లో జురెల్ మాట్లాడుతూ.. ‘నేను క్రీజులోకి వచ్చిన వెంటనే.. నీకు దమ్ముంటే ఇక్కడ సెంచరీ చేసి చూపించు. కానీ శతకం చేయలేవు అని డిక్వెల్లా సవాల్ విసిరాడు. ఆ క్షణంలో నేనేమీ మాట్లాడలేదు. నోటితో కాకుండా బ్యాట్తో సమాధానం చెప్పాలని భావించాను. నేను అనుకున్నట్లుగానే ఓపికను ప్రదర్శించి సెంచరీతో అజేయంగా నిలిచాను. ఆ తర్వాత డిక్వెల్లా దగ్గరకు వెళ్లి నువ్వు అడిగింది నేను చేసి చూపించాను. ఇప్పుడు నువ్వేం చేస్తావని తిరిగి ప్రశ్నించాను. కానీ అతడి నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు’ అని చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి:
అంపైర్లపై నిర్ణయంపై శ్రీలంక ప్లేయర్లు ఫైర్..
హాకీ ప్రపంచ కప్: సెమీస్ రేసు నుంచి భారత్ ఔట్