ఓటమిపై స్పందించిన ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని.. పోస్ట్ వైరల్!
ABN , Publish Date - Apr 28 , 2026 | 11:40 AM
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమిపై ఆ జట్టు సహ యజమాని పార్థ్ జిందాల్ స్పందించారు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న(సోమవారం) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘోర పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జోష్ హేజిల్ వుడ్(4వికెట్లు), భువనేశ్వర్(3వికెట్లు)ల దెబ్బకు 75 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఆర్సీబీ 6.3 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్కు ఇది వరుసగా రెండో ఓటమి. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమిపై ఆ జట్టు సహ యజమాని పార్థ్ జిందాల్ స్పందించారు. ఆటగాళ్లలో స్పూర్తి నింపేలా ఎక్స్ వేదికగా ఆయన చేసిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
'ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు ఇప్పుడు గతంలో కంటే ఎక్కువగా బలంగా ఉండాలి. ఈ ఓటమిని జీర్ణించుకోవడం నిజంగా చాలా కష్టం. కానీ మనం పోరాడుతూనే ఉండాలి. అలానే నమ్మకాన్ని కోల్పోకూడదు' అని పార్థ్ జిందాల్ ఎక్స్లో పోస్ట్ చేశారు. శనివారం(ఏప్రిల్ 25న) పంజాబ్ కింగ్స్పై 264 పరుగులను కాపాడుకోవడంలో ఢిల్లీ క్యాపిటల్స్ విఫలమైనప్పుడు కెప్టెన్ అక్షర్ పటేల్ పెద్దగా సమాధానం చెప్పలేకపోయాడు.
ఈ క్రమంలో 48 గంటల వ్యవధిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో తన జట్టు 75 పరుగులకే కుప్పకూలడంతో అతను మరింత అయోమయానికి గురయ్యాడు. ఈ సీజన్లో ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. 'ఏం జరిగిందో నాకే తెలియదు. అందుకే క్రికెట్లో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అంటారు. మనం ఈ మ్యాచ్ నుంచి ముందుకు సాగాలి' అని మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెజెంటేషన్లో అక్షర్ అన్నాడు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ చరిత్రలోనే ఏకైక ఆటగాడిగా కోహ్లీ
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ బౌలర్